హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయదారులకు యంత్రపరికరాలను అందుబాటులో ఉంచేందుకు సిద్ధమైంది. అందుకు, ప్రతి మండలానికొక కస్టమ్ హైరింగ్ సెంటర్ (సీహెచ్సీ)ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నది.
ఆ దిశగా పనులను వేగవంతం చేస్తున్నది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 197 సీహెచ్సీలను రూ.59.10కోట్లతో అందుబాటులోకి తేవాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో 113 సెంటర్లు పూర్తయ్యాయి. మరో 84 సెంటర్లు తుది దశకు చేరాయి. వీటిని ఆయా మండల సమాఖ్యలు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్పీవో)లు నిర్వహిస్తాయి.
తక్కువ ధరకు యంత్రాలు అద్దె..
సన్న, చిన్న కారు రైతులకు వ్యవసాయ పరికరాలు, యంత్రాలను కొనుగోలు చేసే సామర్థ్యం ఉండదు. రైతులకు ఈ యంత్రాలను తక్కువ ధరకు అద్దెకిచ్చేలా సీహెచ్సీలను ఏర్పాటుచేస్తున్నారు. ఇలా అద్దెకివ్వడం వల్ల ఎఫ్పీవోలకు, మండల సమాఖ్యలకు ఆదాయం కూడా సమకూరనున్నది.