నమస్తే తెలంగాణ న్యూస్ నెట్వర్క్, డిసెంబర్ 27: పవిత్ర పుణ్యక్షేత్రం భద్రగిరి రాములోరి సన్నిధికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం రానున్నారు. 28న ఉదయం 7:20 గంటలకు హైదరాబాద్లోని రాష్ట్రపతి నిలయం నుంచి బయల్దేరుతారు. 7:40 గంటలకు హకీంపేటలోని ఎయిర్ఫోర్స్ స్టేడియానికి చేరుకుంటారు. 7:50 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో బయల్దేరి 8:50 గంటలకు రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 9 గంటలకు బయల్దేరి 9:50 గంటలకు భద్రాచలంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు వస్తారు. 10 గంటలకు హెలిప్యాడ్ నుంచి రోడ్డు మార్గం ద్వారా 10:10 గంటలకు భద్రాచలం చేరుకుంటారు.
10:15 గంటల నుంచి 10:30 గంటల వరకు ఆలయాన్ని సందర్శించి, ప్రసాద్ స్కీం కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. 10:30 గంటలకు స్వామివారిని దర్శించుకుంటారు. 10:45 గంటల నుంచి 11:30 గంటల వరకు సమ్మక్క సారలమ్మ జంజతి పూజారి సమ్మేళనంలో పాల్గొంటారు. అనంతరం వర్చువల్ విధానంలో కుమురంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్ జిల్లాల్లో ఉన్న ఏకలవ్య పాఠశాలలను ప్రారంభిస్తారు. అనంతరం ఐటీసీ అతిథి గృహానికి చేరుకుంటారు. 11:40 నుంచి మధ్యాహ్నం 1:15 గంటల వరకు లంచ్ బ్రేక్ ఉంటుంది. 1:15 గంటలకు 1:25 గంటలకు భద్రాచలం హెలీప్యాడ్కు చేరుకుంటారు. 1:35 గంటలకు హెలికాప్టర్లో వెళ్తారు. అలాగే రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆమెతో పాటు ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 9 గంటలకు భద్రాచలం చేరుకుంటారు. అక్కడి నుంచి ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయానికి చేరుకుంటారు. రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని, ప్రసాద్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. కాగా, ఈ నెల 30న యాదాద్రికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. ఈ పర్యటన సజావుగా సాగేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.