హైదరాబాద్ సిటీబ్యూరో/బొల్లారం, మార్చి 22 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్లోని బొల్లారంలోగల రాష్ట్రపతి నిలయాన్ని ఇక ఏడాది పొడవునా సందర్శించొచ్చు. సామాన్య ప్రజలు, సందర్శకులను రాష్ట్రపతి నిలయం సందర్శనకు అనుమతించే కార్యక్రమాన్ని న్యూఢిల్లీ నుంచి రాష్ట్రపతి ద్రౌపదిముర్ము బుధవారం వర్చువల్గా ప్రారంభించారు. 162 ఏండ్ల చరిత్ర కలిగిన రాష్ట్రపతి నిలయం హెరిటేజ్ భవనాలు, ఆర్ట్ గ్యాలరీ, అండర్ గ్రౌండ్ టన్నెల్, ఆవరణలు, గార్డెన్లు, జై హింద్ ర్యాంప్, హెరిటేజ్ ఫ్లాగ్ పోస్ట్ సైట్ వంటి వాటిని సాధారణ ప్రజలు కూడా సందర్శించే అవకాశం కల్పించారు. రాష్ట్రపతి నిలయం సందర్శనకు టికెట్ విధానాన్ని ప్రవేశపెట్టారు. భారతీయ పౌరులకు రూ.50, విదేశీ పౌరులకు రూ.250 చొప్పున టికెట్ ధర నిర్ణయించారు.
సోమవారం, ఇతర ప్రభుత్వ పండుగలు మినహా.. ఈ నిలయాన్ని సందర్శించేందుకు ప్రజలకు రోజూ అనుమతి ఉంటుందని అధికారులు తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు సందర్శించే అవకాశం ఉండగా.. సాయంత్రం 4 గంటల వరకే ప్రవేశం ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రపతి భవన్ అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపారు. సందర్శకుల కోసం పార్కింగ్, వస్తువులు భద్రపరుచుకొనే గది, వీల్చైర్, కాఫీ షాప్, రెస్ట్రూమ్స్, ఆర్వో వాటర్, క్యాంపస్లో డిస్పెన్సర్లు, ఫస్ట్ ఎయిడ్ సెట్తోపాటు ఉచిత గైడ్వంటి సకల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. కాగా, రాష్ట్రపతి నిలయంలో గవర్నర్ తమిళిసై ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు నిర్వహించారు. కార్యక్రమాల్లో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యద్శ శాంతికుమారి పాల్గొన్నారు.