భద్రాద్రి కొత్తగూడెం : పవిత్ర పుణ్యక్షేత్రం భద్రగిరి రాములోరి సన్నిధికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం రానున్నారు. దీంతో అధికార యంత్రాంగం గత నాలుగురోజులుగా అక్కడే మకాం వేసి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇటు పోలీసు, అటు జిల్లా యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్క కదలికపై నిఘా పెట్టిన పోలీసులు పూర్తిస్థాయి ఆంక్షలు విధించారు. భద్రాచలం వంతెనపైకి ఎవరిని రానివ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. సారపాక నుంచే వాహనాలను నిలిపివేశారు. ఇతరులు ఎవరూ ఆ ప్రాంతానికి వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.
బూర్గంపాడు మండలం సారపాకలో జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంతంలో మూడు హెలీప్యాడ్లను ఏర్పాటు చేసి ట్రయల్ రన్ నిర్వహించారు. సారపాక నుంచి రాష్ట్రపతి టూర్ ప్రారంభం కానుండడంతో భద్రాచలం గోదావరి వంతెన మీదుగా రామాలయం, వీరభద్రకళ్యాణ మండపం వరకు కాన్వాయ్ ద్వారా ట్రయల్ రన్ నిర్వహించారు. కలెక్టర్ అనుదీప్, ఎస్పీ వినీత్ పూర్తిస్థాయిలో వారి కంట్రోల్కు తెచ్చుకున్నారు.
భారత రాష్ట్రపతి బుధవారం హైదరాబాద్లో ఉదయం 7:45 గంటలకు హకీంపేట ఎయిర్బేస్ నుంచి రాజమండ్రి ఎయిర్పోర్టుకు వెళ్తారు. అక్కడ నుంచి 9:50 గంటలకు భద్రాచలం హెలీప్యాడ్కు చేరుకుంటారు. ఆ తర్వాత 10:15 నుంచి 10:30 వరకు భద్రాచలం రామాలయంలో రాములోరి దర్శనం చేసుకుని ప్రసాద్ పథకాన్ని ప్రారంభిస్తారు. అనంతరం సమ్మక్క-సారలమ్మ జయంతి సమ్మేళనంలో పాల్గొంటారు. అనంతరం బైపాస్ రోడ్లో వీరభద్రకళ్యాణ మండపం వద్ద జరిగే వర్చువల్ కార్యక్రమంలో పాల్గొంటారు. 11:40 గంటలకి తిరిగి ఐటీసీ గెస్ట్హౌస్కి చేరుకుంటారు. 13:35 గంటలకు తిరిగి ములుగు జిల్లా రామప్ప టెంపుల్కు వెళ్లనున్నారు. రాష్ట్ర గవర్నర్ తమిళసై కూడా రాష్ట్రపతితో పాటు రానున్నారు. ఆయా కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో భాగంగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆమెతోపాటు ఆయా కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 7 గంటలకు ఖమ్మంలోని వీడీఓస్ కాలనీలో గల క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి 9 గంటలకు భద్రాచలం చేరుకుంటారు. రాష్ట్రపతి పాల్గొనే కార్యక్రమాల్లో మంత్రి పాల్గొని మధ్యాహ్నం 1:45 గంటలకు భద్రాచలం నుంచి బయలుదేరి 3:30 గంటలకు ఖమ్మం చేరుకుంటారు.