హైదరాబాద్/మేడ్చల్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్ర పర్యటన శనివారం ముగిసింది. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ముర్ము ఈ నెల 18న రాజధాని నగరం హైదరాబాద్ వచ్చిన విషయం తెలిసిందే. ఆ రోజు నుంచి ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారం రోజుల పర్యటన అనంతరం శనివారం ఉద యం భారత వాయుసేన ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరిగి వెళ్లారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలోని హకీంపేట్ విమానాశ్రయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, అనసూయ సీతక, ప్రభుత్వ ప్రధాన శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి, కలెక్టర్ గౌతమ్, త్రివిధ దళాల అధికారులు ఘనంగా వీడోలు పలికారు.
ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఈ నెల 27న హైదరాబాద్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఉప రాష్ట్రపతి పర్యటనకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆమె సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీజీపీ రవిగుప్తా, అగ్నిమాపకశాఖ డీజీ నాగిరెడ్డి, జీఏడీ కార్యదర్శి రాహుల్బొజ్జా, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్రాస్, వైద్యారోగ్యశాఖ కమిషనర్ క్రిస్టినాజడ్చోంగ్తూ, ఆర్అండ్బీ కార్యదర్శి శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.