హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో సాధించిన ప్రగతి ప్రస్థానంపై కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ సర్కార్ శ్వేతపత్రాల పేరుతో అబద్ధాలు ప్రచారం చేసిందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. శ్వేతపత్రాలకు దీటుగా స్వేదపత్రాన్ని విడుదల చేసింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ఆదివారం తెలంగాణభవన్లో ‘స్వయం పాలన ప్రారంభమైన అనతికాలంలో కేసీఆర్ ప్రభుత్వ దార్శనికతతో యావత్ తెలంగాణ ప్రజలు చెమటోడ్చి సృష్టించిన సంపద’పై స్వేదపత్రం విడుదల చేస్తున్నాం’ అంటూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణ ప్రగతిని 44 ైస్లెడ్స్తో కేటీఆర్ చేసిన పవర్పాయింట్ ప్రజెంటేషన్ను మీడియా ప్రతినిధులుసహా పార్టీ నేతలు ఆసక్తిగా విన్నారు. 11:27 గంటల నుంచి 12:57 వరకు ప్రజెంటేషన్, ఆ తరువాత మరో 5 నిమిషాలపాటు మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు కేటీఆర్ సమాధానాలిచ్చారు. మాజీ మంత్రులు, పార్టీ నేతలు కేటీఆర్ ప్రజెంటేషన్ చూసి, ఆయన చెప్పే విధానానికి ముగ్ధులయ్యారు. పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఎలక్ట్రానిక్ మీడియాతోపాటు సామాజిక మాధ్యమాల్లో లైవ్ కవరేజ్ కావడంతో తెలంగాణ సమాజం ఆసక్తిగా తొలకించింది. మరోవైపు కేటీఆర్ విడుదల చేసిన స్వేదపత్రంపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నది. మాజీ మంత్రులు మహమూద్ అలీ, సబితాఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, శ్రీనివాస్గౌడ్, చంద్రశేఖర్, ఎంపీలు మాలోత్ కవిత, బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, పాడి కౌశిక్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, రేగా కాంతారావు, మెతుకు ఆనంద్, బేతి సుభాష్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు దేవీప్రసాద్, అల్లిపురం వెంకటేశ్వర్రెడ్డి, రాకేశ్రెడ్డి, వాసుదేవరెడ్డి, పార్టీ నేతలు చెల్మడ లక్ష్మీనర్సింహారావు, దాసోజు శ్రవణ్, పీఎల్ శ్రీనివాస్, రవిసూర్యసహా పార్టీ నేతలు, శ్రేణులు పాల్గొనడంతో తెలంగాణభవన్ కిక్కిరిసిపోయింది.