హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): రాజకీయ నిరుద్యోగులే నిరుద్యోగ దీక్ష చేస్తున్నారని పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఉద్యోగాల భర్తీపై బహిరంగ చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. ఉద్యోగాల భర్తీలో తెలంగాణ కంటే కేంద్రం గొప్పగా చేసినట్టు బీజేపీ నేతలు నిరూపిస్తే తాను దేనికంటే దానికి సిద్ధమని సవాల్ విసిరారు. సోమవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్తో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల వాగ్దానంపై బీజేపీ శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష పార్టీల నాయకులకు పబ్లిసిటీ పిచ్చి ఎక్కువైందని ఎద్దేవా చేశారు. రైతాంగానికి సీఎం కేసీఆర్ చేస్తున్నన్ని కార్యక్రమాలు దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా చేశారా? అని ప్రశ్నించారు. తెలంగాణ అన్ని అంశాల్లో ముందున్నదని, ఈ విషయాన్ని ఏకంగా కేంద్ర ప్రభుత్వ నీతిఆయోగ్ సంస్థే ప్రకటించిందని గుర్తు చేశారు. ప్రతిపక్ష నేతలవి నరంలేని నాలుకలు అని, కుటుంబసభ్యులను రాజకీయాల్లోకి లాగుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతలు బాధ్యతాయుతంగా మాట్లాడాలని హితవు చెప్పారు. నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు సరైనరీతిలో బుద్ధి చెప్తారని అన్నారు. దేశాన్ని ఆర్థికంగా సాదుతున్న ఐదు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని తేల్చి చెప్పారు. బీజేపీ రాష్ట్ర ఇన్చార్జి తరుణ్ చుగ్కు పంజాబ్లో దిక్కుమొక్కు లేదని, ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేత రేవంత్రెడ్డి ముందుగా తన పార్టీలో ఏం జరుగుతున్నదో చూసుకోవాలని తలసాని హితవు పలికారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ బీజేపీ నాయకులను ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గర్లో ఉన్నాయని పేర్కొన్నారు.