హైదరాబాద్, వరంగల్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): కరోనా మూడోవేవ్ రావచ్చనే హెచ్చరికల నేపథ్యంలో విపత్తును సమర్థంగా ఎదుర్కొనేందుకు రాష్ట్రప్రభుత్వం ముందస్తుగానే సిద్ధమవుతున్నది. ఇప్పటికే అన్నిఏర్పాట్లు చేసిన సర్కారు.. అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం ముందుగానే కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. వీటికి ఆమోదం తెలుపుతూ కేంద్రం ఎమర్జెన్సీ కొవిడ్ రెస్పాన్స్ ప్లాన్ఫేజ్ 2 కింద రాష్ట్రానికి నిధులు కేటాయించింది. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు చెరి సగం ఖర్చుతో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపడుతున్నాయి. రూ.456 కోట్లతో కొవిడ్ అత్యవసర మందులు, ఐసీయూ పడకలు, నిర్ధారణ పరీక్షల కేంద్రాలు, చిన్న పిల్లలకు ఐసీయూలు, అదనపు పడకలు ఇతర సదుపాయాలు కల్పించనున్నారు.
అదనంగా ఐసీయూ పడకల ఏర్పాటు
అన్ని ప్రధాన దవాఖానల్లో 850 ఐసీయూ బెడ్ల ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకొంటున్నది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉండే దవాఖానల్లో వీటిని ఏర్పాటుచేస్తారు. వీటిల్లో నిమ్స్కు కొత్తగా 200 ఐసీయూ బెడ్లు కేటాయించారు. టిమ్స్, గాంధీ, మహబూబ్నగర్ జనరల్ దవాఖానలకు 100 చొప్పున, ఉస్మానియాకు 75 బెడ్లను మంజూరుచేశారు. ఆదిలాబాద్ రిమ్స్తోపాటు సిద్దిపేట, నిజామాబాద్, సూర్యాపేట, నల్లగొండ జనరల్ దవాఖానల్లో 50 చొప్పున ఏర్పాటుచేస్తున్నారు. ఒక్కోబెడ్కు రూ.16.85 లక్షల చొప్పున ఖర్చుచేసేలా ప్రభుత్వం నిధులు ఇస్తున్నది. అన్నిచోట్ల 20 శాతం ఐసీయూ బెడ్లను పిల్లల కోసం ప్రత్యేకంగా కేటాయించనున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 16జిల్లాల్లో ఆర్టీపీసీఆర్ ల్యాబ్లు ఏర్పాటుచేయగా, మిగిలిన 17 జిల్లాల్లోనే ఏర్పాటుచేయబోతున్నారు.
అదనంగా ఏర్పాటుచేసే ఐసీయూ పడకలు
నిమ్స్ 200
టిమ్స్ 100
గాంధీ 100
మహబూబాబ్నగర్ 100
ఉస్మానియా 75
ఆదిలాబాద్ రిమ్స్ 50
నిజామాబాద్ 50
సిద్దిపేట 50
నల్లగొండ 50
సూర్యాపేట 50