హైదరాబాద్ : రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రెండు, మూడు రోజుల్లో కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది. ఇదే సమయంలో అరేబియన్ సముద్రం, లక్షద్వీప్లోని పలు ప్రాంతాలకు నైరుతి రుతు పవనాలు ప్రవేశించే అవకాశం ఉంది.
తెలంగాణలోకి జూన్ 5 నుంచి 10వ తేదీ మధ్యలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్లో శనివారం మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో 38.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే 48 గంటల్లో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉండనుంది. ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.