2021 ఏప్రిల్, మే బకాయిల చెల్లింపునకు జీవో.. హర్షం వ్యక్తంచేసిన ఉద్యోగ సంఘాల నేతలు
కారుణ్య నియామకాలకు త్వరలోనే కమిటీ .. టీజీవో నేతలకు సీఎస్ సోమేశ్కుమార్ హామీ
హైదరాబాద్, ఫిబ్రవరి 22 : రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు, సహకార సంస్థల ఉద్యోగులకు రెండు నెలల పీఆర్సీ
బకాయిలను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2021 ఏప్రిల్, మే నెలల బకాయిలను 18 సమాన వాయిదాల్లో చెల్లించేవిధంగా ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రామకృష్ణారావు మంగళవారం జీవో 107ను విడుదల చేశారు. మరణించిన ఉద్యోగుల బకాయిలను వారి కుటుంబాలకు ఒకేసారి చెల్లిస్తామని ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు. జీవో పట్ల ఉద్యోగసంఘాల నేతలు హర్షం వ్యక్తంచేశారు. టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, రాయికంటి ప్రతాప్, టీజీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీ మమత, ఏ సత్యనారాయణ, పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్రెడ్డి, బీరెల్లి కమలాకర్రావు తదితరులు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఆంధప్రదేశ్లోని ఉద్యోగులకు 2013 పీఆర్సీ ఎరియర్స్నే ఇప్పటివరకు ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ ప్రభుత్వం 2013 పీఆర్సీ ఎరియర్స్ను 18 సమాన వాయిదాల్లో నగదు రూపంలో చెల్లించింది. తాజాగా 2020 పీఆర్సీ బకాయిలను కూడా 18 సమాన వాయిదాల్లో నగదు రూపంలో చెల్లించాలని నిర్ణయించడంతో ఉద్యోగసంఘాల నేతలు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
కారుణ్య నియామకాలకు త్వరలో కమిటీ
కారుణ్య నియామకాల కోసం కమిటీని నియమించి, త్వరలోనే పోస్టులు భర్తీచేస్తామని సీఎస్ సోమేశ్కుమార్ తమకు హామీ ఇచ్చినట్టు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) నేతలు చెప్పారు. జోనల్ ఉద్యోగులకు సైతం పరస్పర బదిలీలకు అవకాశం ఇవ్వాలన్న విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు. టీజీవో నేతల బృందం మంగళవారం సచివాలయంలో సీఎస్తో సమావేశమైంది. ఉద్యోగుల సమస్యలపై సీఎస్ సానుకూలంగా స్పందించినట్టు టీజీవో రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వీ మమత, ఏ సత్యనారాయణ వెల్లడించారు. సమావేశంలో టీజీవో నేతలు టీ రవీందర్రావు, జీ వెంకటేశ్వర్లు, ఎంబీ కృష్ణాయాదవ్, రాజ్కుమార్ గుప్తా, జగన్మెహన్, డాక్టర్ హరికృష్ణ, గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు.
నెలకు ఎంత వస్తుంది?
ఒక ఉద్యోగి బేసిక్ వేతనం రూ.83,100 ఉంటే పీఆర్సీ ప్రకారం వేతనం నెలకు రూ.21,048 పెరిగింది. ఆ ఉద్యోగికి ఏప్రిల్, మే బకాయి కింద రూ.42,096 అందుతుంది. దీనిని 18 సమాన వాయిదాల్లో చెల్లిస్తారు. అంటే నెలకు సుమారు రూ.2,339 చొప్పున 18 నెలలపాటు ప్రస్తుత జీతంతో పాటు అదనంగా జమచేస్తారు.