హైదరాబాద్, సెప్టెంబర్23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో త్వరలోనే మరో మెడికల్ కాలేజీ ప్రారంభం కానుంది. వైద్య కళాశాలను ప్రారంభించేందుకు సహస్ర విద్యా సొసైటీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరుచేసింది. ఈ మేరకు వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. హనుమ కొండ జిల్లాలోని హసన్పర్తి మండలం, వంగపహాడ్ గ్రామంలో ‘ప్రతిమ రిలీఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, వరంగల్’ పేరిట మెడికల్ కాలేజీని ప్రారంభించనున్నారు. ఈ కాలేజీతో మరో 150 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం (2022-23) నుంచి ప్రవేశాలు కల్పించనున్నారు. కళాశాలకు అనుబంధంగా సహస్ర సంస్థ ఇప్పటికే 330 పడకల దవాఖానను గత రెండేండ్లుగా నిర్వహిస్తున్నది. వైద్య కళాశాల స్థాపనకు సహస్ర సంస్థ చేసుకున్న ప్రతిపాదన మేరకు మౌలిక సదుపాయాలను, ఇతర వసతులను పరిశీలించేందుకు ప్రభుత్వం ఒక ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు ప్రభుత్వం ఎసెన్షియాలిటీ సర్టిఫికెట్ను జారీచేసింది. సహస్ర సంస్థకు వంగపహాడ్ గ్రామంలో 15 ఎకరాలకు పైగా వ్యవసాయేతర స్థలం ఉన్నట్టు ఉన్నతస్థాయి కమిటీ గుర్తించింది. నేషనల్ మెడికల్ కమిషన్ నియమాల మేరకు అవసరమైన వైద్య పరికరాలుకూడా ఉన్నట్టు తెలుసుకున్నది. దవాఖాన, మెడికల్ కాలేజీకి సంబంధించిన భవన నిర్మాణాలకు సంబంధిత అధికారుల నుంచి ఇప్పటికే అనుమతులు లభించాయి. దీంతో సహస్ర సంస్థ స్థాపించనున్న మెడికల్ కాలేజీకి అనుమతులు మంజూరు చేయవచ్చని ఉన్నతస్థాయి కమిటీ సిఫారసు చేసింది. వరంగల్ జిల్లాలో ఇప్పటికే కాకతీయ మెడికల్ కాలేజీ ఉండగా, తాజాగా ప్రతిమ పేరిట మరో వైద్యకళాశాల ఏర్పాటు కానుంది.
రాష్ట్రంలో ప్రస్తుతం 9 ప్రభుత్వ, 23 ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో 5090 సీట్లు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్ర మెడికల్ కౌన్సిల్లో ప్రస్తుతం 36వేల మంది డాక్టర్లు నమోదై ఉన్నారు. వీరిలో 7,758 మంది ప్రభుత్వ దవాఖానల్లో పనిచేస్తుండగా మరో 1,518 డాక్టర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 1,087 మందికి ఒక డాక్టర్ చొప్పున అందుబాటులో ఉన్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. వెయ్యి మందికి ఒక డాక్టర్ చొప్పున అందుబాటులో ఉంచాలని లక్ష్యంగా పెట్టుకున్నది.
హనుమ కొండ జిల్లాలో మెడికల్ కాలేజీ స్థాపనకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేయడం పట్ల ప్రతిమ గ్రూప్ హర్షం వ్యక్తంచేసింది. గ్రామీణ ప్రజలకు ఉత్తమమైన వైద్యసేవలను అతి తక్కువ ధరకు అందించేందుకు కృషి చేస్తామని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ హరిణి బోయినపల్లి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తమ సంస్థ కరీంనగర్లో గత 20 సంవత్సరాలుగా 1100 పడకలతో వైద్యకళాశాలను నిర్వహిస్తున్నదని తెలిపారు. అదేవిధంగా 300 పడకలతో హైదరాబాద్లోని కాచిగూడ, కూకట్పల్లిలో మల్టీస్పెషాలిటీ వైద్యశాలలను నడుపుతున్నదని చెప్పారు. అదేవిధంగా వరంగల్లో 300 పడకలతో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేశామని, త్వరలోనే అది అందుబాటులోకి రానుందని తెలిపారు.