ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ మోడల్ స్కూల్లో ఆదివారం నీట్ యూజీ పరీక్ష పేపర్ మార్పుపై అధికారులు స్పందించారు. సోమవారం ఆర్డీవో లోకేశ్వర్ విచారణ చేపట్టారు. ఆసిఫాబాద్ పరీక్ష కేంద్రం కో ఆర్డినేటర్ను ఆర్డీవో ప్రశ్నించారు. కాగా, వైద్య విద్యలో ప్రవేశాల కోసం ఏటా నిర్వహించే నీట్ యూజీ పరీక్ష (NEET UG Exam) విజయవంతంగా ముగిసింది.
అయితే దేశవ్యాప్తంగా విద్యార్థులకు ఎన్టీఏ అందించిన పేపర్ ఒకటైతే.. కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఇచ్చిన ఎగ్జామ్ పేపర్ మాత్రం మరొకటి. జిల్లా కేంద్రంలోని ఆసిఫాబాద్ మోడల్ స్కూల్లో ఆదివారం నీట్ యూజీ పరీక్ష జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులకు ఇచ్చిన పేపర్ తారుమారయింది. అభ్యర్థులకు ఒక సెట్కు బదులు మరో సెట్ నుంచి ప్రశ్నపత్రాలు ఇచ్చారు. పరీక్ష రాసిన తర్వాత విద్యార్థులు గుర్తించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ప్రశ్నపత్రం మారడంపై విద్యార్థులు ఆందోళన వ్యక్తంచేశారు. కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
కాగా, సమాచార లోపంలో ప్రశ్నపత్రం మారిందని పరీక్ష నిర్వహించిన సిటీ కోఆర్డినేటర్ తెలిపారు. ఎస్బీఐ నుంచి తీసుకురావాల్సిన పేపర్కు బదులు కెనరా బ్యాంకు నుంచి తీసుకొచ్చిన పేపర్ను విద్యార్థులకు పంపిణీ చేశామన్నారు. అయితే విద్యార్థులు మాత్రం తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.