గాజా: ఈస్ట్రన్ రఫా(Eastern Rafah) నుంచి పాలస్తీనా పౌరుల్ని ఇజ్రాయిల్ ఆర్మీ తరలిస్తున్నది. ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లాలని ఇజ్రాయిల్ ఆదేశాలు జారీ చేసింది. గాజా సిటీలో భారీ ఆపరేషన్కు ప్లాన్ చేసిన నేపథ్యంలో ఈ ఆదేశాలను ఇచ్చారు. సుమారు లక్ష మంది పాలస్తీనియన్లను రఫా నుంచి తరలించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఖాన్ యూనిస్, అల్ మావాసి నగరాల దిశగా ఆ జనం వెళ్తున్నారు. ప్రజల్ని వెళ్లగొట్టేందుకు ఇజ్రాయిల్ దళాలు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. టెక్ట్స్ మెసేజ్లు, ఫ్లయర్స్, సోషల్ మీడియా ద్వారా ప్రజలకు సందేశాలను చేరవేస్తున్నారు.
తూర్పు రఫాలో ఉన్న హమాస్ దళాల్ని తరిమేందుకు ఈ ఆపరేషన్ చేపట్టనున్నట్లు ఇజ్రాయిల్ ఆర్మీ ప్రతినిధి తెలిపారు. రఫా నగరాన్ని స్వాధీనం చేసుకుంటేనే హమాస్తో పోరులో విజయం సాధించినట్లు అవుతుందని ఇజ్రాయిల్ భావిస్తున్నది. అయితే పది లక్షల మంది పాలస్తీనియన్లు ఆ ప్రాంతంలో ఉండడం వల్ల.. అక్కడ దాడి జరిగితే ప్రాణనష్టం అధికంగా ఉంటుందని పశ్చిమ దేశాలు హెచ్చరిస్తున్నాయి.