నిజామాబాద్ : రికార్డు సమయంలో హైలెవెల్ వంతనెల నిర్మాణాలను పూర్తి చేసుకొని, ప్రారంభోత్సవం చేయడం సంతోషంగా ఉందని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్, మోతె గ్రామాల్లో రికార్డు సమయంలో వంతెన నిర్మించామన్నారు. వేల్పూర్ పెద్దవాగుపై రూ.15 కోట్లతో నూతనంగా నిర్మించిన హై లెవల్ బ్రిడ్జ్తో పాటు పాటు, మోతె కప్పల వాగుపై రూ.12కోట్లతో నూతనంగా నిర్మించిన హై లెవల్ వంతెనలకు మంత్రి ప్రారంభోత్సవం చేశారు.
వంతన నిర్మాణాలు అందుబాటులోకి రావడంతో వేల్పూర్ – భీంగల్ మార్గంలో రవాణా సదుపాయం మరింత మెరుగుపడినట్లయ్యింది. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే వంతెన నిర్మాణాలను పూర్తి చేశామన్నారు. ఇంత స్వల్ప వ్యవధిలో బ్రిడ్జిల నిర్మాణాలు పూర్తి చేయవచ్చని ఆచారణాత్మకంగా నిరూపించిన ఆర్అండ్బీ అధికారులు, స్థానిక కాంట్రాక్టర్లను మంత్రి అభినందించారు. రికార్డు టైంలో పూర్తయిన వేల్పూర్, మోతే బ్రిడ్జిలు రాష్ట్రానికి మార్గదర్శకంగా నిలువబోతున్నాయని పేర్కొన్నారు. బ్రిడ్జిల నిర్మాణాలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు సందర్భంగా నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్అండ్బీ ఎస్ఈ రాజేశ్వర్రెడ్డి, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.