జయశంకర్ భూపాలపల్లి : ప్రాణహిత పుష్కరాలు ఆదివారం ఘనంగా ముగిశాయి. చివరి రోజు ఆదివారం కాళేశ్వరం పుష్కరఘాట్ వద్ధ సాయంత్రం పవిత్ర ప్రాణహిత నదికి హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాళేశ్వరం దేవాలయం నుంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాటం ఆడుతూ నదీ తీరం వరకు ఊరేగింపుగా వేదపండితులు, అర్చకులు, భక్తజనం, ఆలయ అధికారులు తరలివచ్చారు. నది వద్ద వేద పండితులు, అర్చకులు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
అనంతరం ప్రాణహిత నదికి వాయనం, (చీర, జాకెట్, గాజులు, సుగంధ పరిమళాలు) దీపాలు వెలిగించి పవిత్ర ప్రాణహిత నదికి హారతినివ్వడంతో ప్రాణహిత పుష్కారాలు ముగిసినట్టు వేదపండితులు భక్తులనుద్దేశించి వివరించారు. కార్యక్రమాన్ని స్థానికులతో పాటు వివిధ ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు భక్తి శ్రద్ధలతో వీక్షించి తన్మయత్వం పొందారు. ప్రాణహిత పుష్కారాలను ఘనంగా నిర్వహించడంలో పుష్కారాలకు 10 రోజుల ముందు నుంచి క్షేత్రస్థాయిలో కృషి చేసి షవర్లు, తాత్కాలిక మరుగుదొడ్లు, పారిశుధ్య పనులు, మెడికల్ క్యాంపులు, పటిష్టమైన పార్కింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి పుష్కర భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేసిన జిల్లా, మండల స్థాయి అధికారులకు , సిబ్బందిని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అభినందించారు.
ప్రధానంగా పుష్కరాల విజయవంతానికి అహర్నిశలు కృషిచేసిన ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ సర్పంచ్, ప్రజాప్రతినిధులు, డీఎస్పీ, డీపీఓ, ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ అధికారులు, ఇరిగేషన్ శాఖ అధికారులు, ఫిషరీస్ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు, ఆర్టీసీ, అగ్నిమాపక, వైద్య ఆరోగ్య, రెవెన్యూ, ఎంపీడీఓ, దేవాదాయశాఖ అధికారులు, సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ (ఏడీసీ) ఎండోమెంట్ అడిషనల్ కమిషనర్ కే జ్యోతి, అసిస్టెంట్ కమిషనర్ ఆర్ సునీత, దేవాలయం ఈఓ మహేశ్, మహాదేవపూర్ ఎంపీపీ రాణిబాయి తదితరులు పాల్గొన్నారు.