కుత్బుల్లాపూర్, జనవరి 9: ప్రజాపాలనలో భాగంగా ఆరు గ్యారెంటీల కోసం ప్రజలనుంచి తీసుకున్న దరఖాస్తులకు గ్యారెంటీ లేకుండా పోయింది. దరఖాస్తుల డాటాఎంట్రీ విషయంలో అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సోమవారం ఓ ప్రైవేటువ్యక్తి చేతికి ఇచ్చి పంపిస్తుండగా బాలానగర్ ఫ్లైఓవర్పై పడి దరఖాస్తులు చెల్లాచెదురు అయిన ఘటనను మర్చిపోకముందే మంగళవారం కుత్బుల్లాపూర్లోనూ అలాంటి ఘటనే జరిగింది.
అధికారులు ఓ ప్రైవేటు వ్యక్తికి 200కుపైగా దరఖాస్తులు ఇచ్చి పంపడం కలకలం రేపింది. అతడు దరఖాస్తులను పట్టుకెళ్లడం చూసి వాటిని ఎక్కడికి తీసుకెళ్తున్నావని ప్రశ్నిస్తే అప్లికేషన్లను ఆన్లైన్ చేసేందుకు ఇంటికి తీసుకెళ్తున్నాని చెప్పడంతో స్థానికులు అవాక్కయ్యారు. ఈ విషయమై కుత్బుల్లాపూర్ ఉపకమిషనర్ నరసింహను వివరణ కోరగా అలాంటిదేమీ లేదని తప్పించుకునే ప్రయత్నం చేశారు. కుత్బుల్లాపూర్ మునిసిపల్ కార్యాలయం ఆవరణతోపాటు ఆయా వార్డు కార్యాలయాల్లో జరుగుతున్న డాటాఎంట్రీ పనుల్లో విద్యార్థులను నియమించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.