KTR | కాంగ్రెస్ చెప్పుకున్న ప్రజాపాలన కాస్త పర్సంటేజీల పాలనగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తమ అవినీతి కమీషన్ల నుంచి దృష్టి మరల్చేందుకే కమిషన్ నోటీసుల డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. 17 నెలలుగా పాలన చేతకాక, ఇచ్చిన దొంగ హామీలను ఎలా అమలు చేయాలో తెలియక, తమ కమీషన్ల అవినీతి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే కాళేశ్వరం కమిషన్తో కేసీఆర్కు నోటీసులు ఇప్పించారని కేటీఆర్ అన్నారు. ఓ వివాహ వేడుకలో పాల్గొనేందుకు నల్గొండకు వెళ్లిన కేటీఆర్.. అక్కడ మీడియాతో మాట్లాడారు.
ఈ ప్రభుత్వంలో 20 నుంచి 30 శాతం కమీషన్లు, పర్సంటేజీలు ఇవ్వకపోతే ఏ పని జరగదని కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలే బహిరంగంగా చెబుతున్నారని కేటీఆర్ అన్నారు. ఉప ముఖ్యమంత్రి చాంబర్ ముందు కాంట్రాక్టర్లు ధర్నా చేసిన ఘటన కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతికి పరాకాష్ట అని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన 17 నెలల కాలంలోనే పాలన చేతగాక ప్రజలకు ఇచ్చిన అడ్డగోలు హామీలను నెరవేర్చే దమ్ము లేక కాంగ్రెస్ ప్రభుత్వం చతికిలపడిందని విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టును ఒక విఫల ప్రయోగంగా చూపించే బీజేపీ, కాంగ్రెస్ కుట్రలో భాగంగానే కేసీఆర్కు నోటీసులు వచ్చాయని మండిపడ్డారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా అవన్నీ దూదిపింజల్లా తేలిపోతాయని స్పష్టం చేశారు. దేశంలోని న్యాయవ్యవస్థ మీద తమకు అపార గౌరవం ఉందని.. ముమ్మాటికీ ధర్మమే గెలుస్తుందని వ్యాఖ్యానించారు. తెలంగాణకు మేలు చేసిన వారిని దేవుడు కాపాడుతాడన్న నమ్మకం ఉందన్నారు.
గత 17 నెలలుగా పాలన చేతకాక, ఇచ్చిన అడ్డగోలు హామీలు నెరవేర్చే దమ్ములేక, తీసుకుంటున్న కమీషన్ల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు.. ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని డ్రామాలాడినా, పూటకో కమిషన్ వేసి ఎన్ని చిల్లర ప్రయత్నాలు చేసినా రేవంత్ సర్కార్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు.
ముమ్మాటికీ… pic.twitter.com/zTT24JUjZN
— BRS Party (@BRSparty) May 21, 2025
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కమీషన్ల కోసం కక్కుర్తి పడటంతో వేల కోట్ల ప్రజాధనం వృథా అయిందని కేటీఆర్ ఆరోపించారు. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతే ఇప్పటివరకు ఆ నిర్మాణ సంస్థ మీద చర్యలు తీసుకోలేదని.. కనీసం విచారణ కూడా జరపలేదన్నారు. వట్టెం పంప్ హౌస్ మునగడం, పెద్దవాగు ప్రాజెక్టు రెండుసార్లు కొట్టుకుపోవడం మీద కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరపలేదని చెప్పారు. బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం వెనుక ఉన్న మతలబు ఏంటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలి 3 నెలలు గడుస్తుంటే అందులో నుంచి శవాలను తీసే సోయి ఈ ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. అసలు ఆ టన్నెల్ ఎందుకు కూలిందో చెప్పే తెలివి ముఖ్యమంత్రికి, మంత్రులకు లేదని అన్నారు. సమర్థవంతమైన ప్రభుత్వం ఉంటే ఈ మూడు నెలల కాలంలో మంగళ గ్రహం నుంచి కూడా మనుషులను తిరిగి తెచ్చేదని చెప్పారు. కానీ ఈ చేత కానీ ప్రభుత్వానికి టన్నెల్ నుంచి చనిపోయిన వారి శవాలు తెచ్చే శక్తి లేదని విమర్శించారు.
కమిటీల పేరుతో, విచారణల పేరుతో కాలయాపన చేస్తూ ఆరు గ్యారంటీల అమలును పక్కనపెడదామనుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రయత్నాలను చూస్తూ ఊరుకోమని కేటీఆర్ హెచ్చరించారు. నెలకు 2,500 రూపాయలు ఎప్పుడు ఇస్తావని అడుగుతున్న కోటి 68లక్షల మంది ఆడబిడ్డల తరపున, తులం బంగారం ఏది అని అడుగుతున్న ఆడపిల్లల తల్లిదండ్రుల తరపున, నెలకు 4000 రూపాయల పెన్షన్ ఎప్పుడిస్తావని అడుగుతున్న పెద్దమనుషుల తరపున ప్రభుత్వంతో బీఆర్ఎస్ కొట్లాడుతుందని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో చెప్పిన ప్రతి హామీని అమలుచేసేదాకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. హామీలు అమలుచేయకుండా డిసెప్షన్, డిస్ట్రక్షన్, డిస్ట్రాక్షన్ అనే చిల్లరమల్లర ప్రయత్నాలు చేస్తే తెలంగాణ ప్రజలు తిరగబడే రోజు వస్తుందని కేటీఆర్ హెచ్చరించారు.