చండూరు, సెప్టెంబర్ 11: తెలంగాణను అంధకారంలోకి నెట్టే కుట్రతోనే బీజేపీ మునుగోడు ఉప ఎన్నికను తీసుకొస్తున్నదని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఆరోపించారు. ఆదివారం నల్లగొండ జిల్లా చండూరు లో టీఆర్ఎస్కేవీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలోఎక్కడా లేనివిధంగా తెలంగాణలో నిరంతర విద్యుత్తును సరఫరా చేస్తుంటే.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఓర్వలేక విద్యుత్తు సంస్కరణలు చేపట్టిందని మండిపడ్డారు.
డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పుకొనే గుజరాత్తోపాటు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో నేడు రైతాంగానికి మీటర్లు పెట్టి 6 గంటల విద్యుత్తును అందిస్తున్నదని ఎద్దేవా చేశారు. 2014కు ముందు తెలంగాణలో నెలకొన్న పరిస్థితులు నేడు గుజరాత్లో ఉన్నాయన్నారు. సంపద మొత్తం అదానీ, అంబానీలకు దోచిపెట్టి దేశాన్ని అంధకారంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీకి గుణపాఠం తప్పదన్నారు. కార్మికులంతా రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉండి మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
చండూరు/నాంపల్లి/మర్రిగూడ: చండూరు మండ లం బంగారిగడ్డకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 50 మంది.. సర్పంచ్ పల్లె వెంకటయ్య ఆధ్వర్యంలో కారెక్కారు. నాంపల్లి మండలం మల్లపురాజుపల్లికి చెందిన మాజీ సర్పంచ్ పల్లేటి లింగయ్య, పల్లేటి నాగరాజు, బీజేపీకి చెందిన గొడ్డటి రామచంద్రం టీఆర్ఎస్లో చేరారు. వీరందరికీ మంత్రి జగదీశ్రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మర్రిగూడ మండలం యరగండ్లపల్లిలో కాంగ్రెస్కు చెందిన 9వ వార్డు సభ్యురాలు ముండ్ల వెన్నెలాశివకుమార్తోపాటు నాయకులు ముండ్ల వెంకటేశ్, రవి, మాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ దంటు జగదీశ్వర్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.