హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో వంట నూనెల పరిశ్రమకు అనువైన వాతావరణం ఉన్నదని, ముడి సరుకు విస్తృతంగా అందుబాటులో ఉన్నదని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. పెట్టుబడులు పెట్టేవారికి అవసరమైతే మరిన్ని రాయితీలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని పేర్కొన్నారు. శుక్ర, శనివారాల్లో హైదరాబాద్లోని ఐటీసీ కోహినూర్ హోటల్లో ఇండియన్ వెజిటబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ఐవీపీఏ), రౌండ్ టేబుల్ ఆన్ సస్టెయినబల్ పామ్ ఆయిల్ (ఆర్ఎస్పీవో), సెంటర్ ఫర్ రెస్పాన్సిబుల్ బిజినెస్ (సీఆర్బీ), మలేషియన్ పామ్ ఆయిల్ కౌన్సిల్ (ఎంపీఓసీ) సంయుక్తంగా ‘ఆయిల్ సీడ్, వెజ్ ఆయిల్’పై గ్లోబల్ రౌండ్ టేబుల్- 2022 సదస్సు నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమాన్ని మంత్రులు కేటీఆర్, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో 20 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు చేసేలా చర్యలు తీసుకొంటున్నామని, ఇప్పటికే సాగు ప్రారంభమైందని చెప్పారు.
వేరుశనగ, పొద్దు తిరుగుడు, సోయాబీన్ వంటి పంటలు పెద్ద ఎత్తున సాగవుతున్నాయని వెల్లడించారు. దీని ద్వారా ఆయిల్ పరిశ్రమకు అవసరమైన ముడి సరుకు విరివిగా లభ్యమవుతుందని వివరించారు. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల్లో సోయాబీన్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వేరుశనగ, ఇతర జిల్లాల్లో పొద్దు తిరుగుడు పంటను పండిస్తున్నారని వెల్లడించారు. నూనె పంటల సాగును ప్రొత్సహించడం ద్వారా ఆయిల్ దిగుమతులను తగ్గించుకోవచ్చని అన్నారు. మనదేశ అవసరాల్లో 60 శాతం ఆయిల్ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొంటున్నామని, దేశీయంగా ఆయిల్ సీడ్ పంటలను ప్రోత్సహిస్తే దీనిని గణనీయంగా తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు. తెలంగాణలో 10 వేల ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
16 లక్షల ఉద్యోగాలు
టీఎస్బీపాస్ ద్వారా పరిశ్రమల స్థాపనకు 15 రోజుల్లో అనుమతులు ఇస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన అమెజాన్ సంస్థకు 11 రోజుల్లో అనుమతులు ఇచ్చామని చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు టీఎస్బీపాస్ ద్వారా 20 వేలకు పైగా పరిశ్రమలకు అనుమతులు ఇచ్చామని, వీటి ద్వారా దాదాపు రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు వచ్చాయని వెల్లడించారు. 16 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించామని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 40 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పిస్తున్నామని గుర్తుచేశారు. 2014లో రాష్ట్రంలో 68 లక్షల టన్నుల వరి పండితే, 2022 నాటికి 258 లక్షల టన్నుల వరి ధాన్యం పండిందని వివరించారు. ఇదంతా సీఎం కేసీఆర్ నాయకత్వం ద్వారానే సాధ్యమైందని అన్నారు. లైఫ్ సైన్సెస్కు తెలంగాణ హబ్గా మారిందని, వాక్సిన్ క్యాపిటల్గా ఎదిగిందని పేర్కొన్నారు. దేశంలో తయారయ్యే డ్రగ్స్లో 40 శాతం హైదరాబాద్లోనే తయారవుతున్నాయని, ప్రపంచంలోని ప్రఖ్యాతిగాంచిన ఐటీ కంపెనీలు ఇక్కడే తమ రెండో అతి పెద్ద కార్యాలయాలను ఏర్పాటు చేశాయని వెల్లడించారు.
తెలంగాణ ప్రోత్సాహం భేష్:సుధాకర్ దేశాయ్
ఆయిల్పామ్పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం అద్భుతమని ఐవీపీఏ అధ్యక్షుడు సుధాకర్ దేశాయ్ ప్రశంసించారు. 20 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేయాలనుకోవటం ఈ రంగానికి గొప్ప ప్రోత్సాహం ఇస్తుందని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలు కూడా ఇలాగే ప్రోత్సహిస్తే ఆయిల్ను ఎగుమతి చేసే స్థాయికి ఎదుగుతామని తెలిపారు. కరోనా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటనూనెల రంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధించాల్సిన ఆవశ్యకతను మరోమారు గుర్తుచేసిందని అన్నారు. సమావేశానికి వంటనూనెల నిపుణులు, పరిశోధకులు, టెక్నాలజిస్ట్లు, వంటనూనెల పరిశ్రమలో కీలక సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. వాణిజ్య ప్రదర్శన ఏర్పాటు చేసి వివిధ కంపెనీల ఉత్పత్తులు, సేవలు ప్రదర్శించారు.
మార్చి నాటికి 1.78 లక్షల ఎకరాల్లోఆయిల్పామ్ సాగు: మంత్రి నిరంజన్రెడ్డి
రాష్ట్రంలో వచ్చే ఏడాది మార్చి నాటికి 1.78 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగుచేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నామని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. మన దేశంలో ఏటా 20 నుండి 22 మిలియన్ టన్నులు వంటనూనెల వినియోగం ఉంటే, అందులో కనీసం 50 శాతం కూడా ఉత్పత్తి చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నూనె గింజల దిగుమతికే ఏటా దాదాపు రూ. లక్ష కోట్లు వెచ్చిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో గత ఏడాది వరకు 50 వేల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగైందని తెలిపారు. 25 జిల్లాలను 11 కంపెనీలకు కేటాయించి ఆయిల్పామ్ నర్సరీలు, ఇతర సౌకర్యాలు, రైతులకు అవగాహన కల్పించి సాగును పెంచుతున్నామని వివరించారు. వచ్చే ఐదేండ్లలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. 40 వేల ఎకరాల్లో ఇప్పటికే మొకలు నాటడం పూర్తయిందని వివరించారు.