Srisailam | శ్రీశైలం : శ్రీశైలం ఆలయంలో నందీశ్వరస్వామి విశేష పూజలు అందుకున్నారు. బుధవారం మధ్యాహ్నం త్రయోదశి ఘడియలు రావడంతో.. నందీశ్వరస్వామి వారికి పరోక్షసేవగా విశేషార్చన నిర్వహించారు. ప్రతి మంగళవారంతో పాటు త్రయోదశి రోజులలో దేవస్థానసేవగా ఈ కైంకర్యం జరిపించబడుతోంది. అయితే ప్రతి నెలలో కూడా త్రయోదశి రోజులలో అనగా శుద్ధ త్రయోదశి, బహుళ త్రయోదశి రోజులలో భక్తులు నందీశ్వరస్వామివారి పూజను పరోక్షసేవగా జరిపించుకునే అవకాశం కూడా కల్పించబడింది.
కాగా బుధవారం మొత్తం 28 మంది భక్తులు పరోక్షసేవగా ఈ నందీశ్వరస్వామి విశేషపూజను జరిపించుకున్నారు. ఈ పరోక్షసేవలో తెలుగురాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుండి కూడా భక్తులు ఈ విశేషపూజను నిర్వహించుకున్నారు. ఈ విశేషార్చనలో ముందుగా లోకక్షేమాన్ని కాంక్షిస్తూ దేశం శాంతిసౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, పాడి సమృద్ధిగా ఉండాలని, జనులకు ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాలమరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, జనులందరూ సుఖశాంతులతో ఉండాలంటూ అర్చకస్వాములు, వేదపండితులు సంకల్పాన్ని చెప్పడం జరుగుతోంది.
అనంతరం కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతిపూజను జరిపించబడుతోంది. ఆ తరువాత నందీశ్వరస్వామికి శాస్త్రోక్తంగా పంచామృతాలతోనూ, ఫలోదకాలతో హరిద్రోదకం, కుంకుమోదకం, గంధోదకం, భస్మోదకం, రుద్రాక్షోదకం, బిల్వోదకం, పుష్పోదకం, సువర్ణోదకం, మల్లికాగుండంలోని శుద్ధజలంతో అభిషేకం నిర్వహిస్తారు. తరువాత నందీశ్వరస్వామికి అన్నాభిషేకం నిర్వహించబడుతుంది. వృషభసూక్తం మొదలైన వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా ఈ విశేషాభిషేకాన్ని చేయడం జరుగుతుంది. తరువాత నందీశ్వరస్వామివారికి నూతనవస్త్ర సమర్పణ, విశేషపుష్పార్చనలను చేస్తారు. అనంతరం నానబెట్టిన శనగలను నందీశ్వరస్వామికి సమర్పించడం జరుగుతుంది. కాగా త్రయోదశి రోజున జరిపించబడే నందీశ్వరస్వామివారి పరోక్షసేవకు భక్తులు ఆన్లైన్ ద్వారా రూ.1,116 లను సేవారుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. www.srisailadevasthanam.org లేదా aptemples.ap.gov.in ద్వారా చెల్లింపు చేయవచ్చు.
సందీశ్వరస్వామివారి ఆరాధన వలన సంతానంలేనివారికి సంతానం కలుగుతుందని, సమస్యలు తొలగి సుఖసంతోషాలు కలుగుతాయని, రుణబాధలు తీరుతాయని, అనారోగ్యం తొలగి ఆరోగ్యం చేకూరుతుందని, కష్టాలు నివారించబడతాయని, మానసిక ప్రశాంతత చేకూరుతుందని పండితులు పేర్కొంటున్నారు. అదేవిధంగా ఈ స్వామికి నానబెట్టినశనగలను సమర్పించడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పబడుతోంది. అందుకే ఈ స్వామివారికి శనగలబసవన్న అనే పేరు కూడా ప్రసిద్ధంగా ఉంది.