మైలార్దేవ్పల్లి/బండ్లగూడ, జనవరి 18: గౌడ ధార్మిక సంస్థ ఆధ్వర్యంలో ఆలయాల వద్ద గౌడ భవనాలు నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ వెల్లడించారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టీ ప్రకాశ్గౌడ్ను గురువారం మైలార్దేవ్పల్లిలోని ఆయన నివాసంలో శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్తోపాటు మర్యాదపూర్వకంగా కలిశారు. గౌడ సంక్షేమం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి వారితో చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యాదాద్రిలో ఇప్పటికే గౌడ భవనంలో సేవలు ప్రారంభించామని తెలిపారు. వేములవాడ, శ్రీశైలం తదితర పుణ్యక్షేత్రాల్లో గౌడ భవనాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఈ నెల 23న మైలార్దేవ్పల్లిలోని దుర్గా కన్వెన్షన్ హాలులో గౌడ సంక్షేమ సంఘం సమావేశం కోసం ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రకటించారు. కాగా, మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ తనను కలవడంలో ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవని, గౌడ సంక్షేమ సంఘం సమావేశాల ఏర్పాట్లపై చర్చించేందుకే కలుసుకున్నామని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ చెప్పారు. మరోవైపు, ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో వెంటనే బీసీ కులగణన నిర్వహించాలని మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ను బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ఒక ప్రకటనలో కోరారు.