హైదరాబాద్, నవంబర్ 13(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ లొల్లి గల్లీ దాటి ఢిల్లీకి చేరింది. హుజురాబాద్లో పార్టీ కావాలని ఓడిపోయిన తీరు ఇప్పుడు కల్లోలం సృష్టిస్తున్నది. ఓటమి కోవర్టుల రగడ జగడంగా మారి అధిష్ఠానం దూత ముందే ముష్టాముష్టికి దారితీసింది. ఒక బడానేత మరో సీనియర్ను పట్టుకుని ‘బ్లడీఫూల్ చెప్పుతో కొడతా’ అని లంఘించడం ఈ లొల్లికి పరాకాష్ట. ఢిల్లీలో కొట్లాడుకుని తమ పరువు మాత్రమే కాకుండా రాష్ట్రం పరువు తీస్తున్నారు. నలుగురు ఒకతాటి మీదకు రాలేనివారు నాలుగు కోట్ల మందిని ఏం ఉద్ధరిస్తారు? వీళ్లా తెలంగాణను ఉద్ధరించేది? హుజూరాబాద్ ఓటమిపై ఢిల్లీలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం నిర్వహించిన సమావేశం రసాభాస అయింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై వేణుగోపాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. ‘కాంగ్రెస్లో మోనార్కిజం నడవదు. అందర్నీ కలుపుకొని పోవాలి. మీ ఆధ్వర్యంలో జరిగిన తొలి ఎన్నికల్లో పార్టీకి డిపాజిట్ కూడా దక్కకపోవడం ఏమిటి? హుజూరాబాద్ ఎన్నికల్లో ఇంత దారుణమైన వ్యూహం ఎలా అమలుచేశారు? ఈటలకు లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకొన్నారన్న ఆరోపణలపై మీ వివరణ ఏమిటి? ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుంది’ అంటూ గడ్డిపెట్టినట్టు తెలిసింది. హుజూరాబాద్లో పార్టీ నిర్వహించిన పలు బహిరంగ సమావేశాలకు జనాలు బాగానే వచ్చారు కదా? మరి ఓట్లు ఎందుకు రాలేదని రేవంత్రెడ్డిని కేసీ వేణుగోపాల్ అడిగిన మరో ప్రశ్న.
మరోవైపు హుజూరాబాద్ ఓటమిపై కేసీ వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన సమావేశం ఉత్తమ్ వర్సెస్ పొన్నం ప్రభాకర్గా మారింది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం పతాకస్థాయికి చేరింది. ఈ సమావేశంలో ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు తీవ్రమైన స్థాయిలో ఆరోపణలు చేసుకొన్నట్టు తెలిసింది. ఒక దశలో వాగ్వాదం ముదిరి ఒకరి మీదకు మరొకరు ఉరికారట. ఉత్తమ్కుమార్రెడ్డి ఇతర పార్టీలకు సహకరిస్తున్నారని, కావాలని కౌశిక్రెడ్డిని టీఆర్ఎస్లోకి పంపించి ఎమ్మెల్సీ ఇప్పించారని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. దీనిపై మండిపడిన ఉత్తమ్ ‘బ్లడీ ఫూల్’ అం టూ పొన్నంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడినట్టు సమాచారం. తప్పుగా మాట్లాడితే చెప్పుతో కొడతానంటూ ఉత్తమ్ మండిపడ్డట్టు తెలిసింది. పార్టీలోని కొందరు కీలకనేతలే బీజేపీ అభ్యర్థి ఈటలకు సహకరించారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు.
సమావేశంలో పార్టీ కీలకనేతలు ఉత్తమ్ కుమార్రెడ్డి, భట్టి విక్రమార్క, మధుయాష్కీగౌడ్, శ్రీధర్బాబు, హనుమంతరావు అధిష్ఠానం ముందే రేవంత్రెడ్డిని కడిగిపారేశారని, రేవంత్ అనుసరించిన తీరే హుజురాబాద్ ఓటమికి కారణమని ఆరోపించినట్టు తెలిసింది. బలమైన అభ్యర్థులను ఎందుకు బరిలో దింపలేదనేది సీనియర్లు లేవనెత్తిన ముఖ్యమైన ప్రశ్న. కొండా సురేఖతో పాటు దరఖాస్తు చేసుకొన్న వారిని కాదని, వెంకట్ను ఎంపిక చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని రేవంత్రెడ్డిని కేసీ వేణుగోపాల్ నిలదీశారట. అసలు బల్మూరి వెంకట్ అభ్యర్థిత్వమే తప్పని ఉత్తమ్, భట్టి, వీహెచ్, శ్రీధర్బాబు తేల్చి చెప్పినట్టు సమాచారం. మరోవైపు తాను నిజాలు మాట్లాడుతాననే ఢిల్లీ మీటింగ్కు ఆహ్వానించలేదని రాష్ట్ర కాంగ్రెస్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. పలు ప్రశ్నలు సంధిస్తూ పార్టీ అధిష్ఠానానికి లేఖ రాశారు.