Ponnala Lakshmaiah | హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారని, రేపు సీఎంను కలిసి తర్వాత తుది నిర్ణయం ప్రకటిస్తానని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. ఇవాళ మధ్యాహ్నం పొన్నాల ఇంటికి మంత్రి కేటీఆర్తో పాటు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, శానంపూడి సైదిరెడ్డి, సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్ వెళ్లారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం పొన్నాల లక్ష్మయ్య మీడియాతో మాట్లాడారు.
కేటీఆర్ వచ్చి తనను బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారని పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు రావాలని కేటీఆర్ కోరారు. రేపు కేసీఆర్ను కలిసిన తర్వాత వివరాలు తెలియజేస్తానని తెలిపారు. రేవంత్ రెడ్డి మాటలు సిగ్గు ఉండేవారు మాట్లాడేవేనా? అని ప్రశ్నించారు. తన బ్యాక్గ్రౌండ్ ఏంటో రేవంత్ తెలుసుకోవాలని సూచించారు. పార్టీకి, ప్రాంతానికి చేసిన సేవలను కనుమరుగు చేశారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలవలేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రేవంత్ తన పార్లమెంట్ పరిధిలో ఎన్ని సీట్లు గెలిచారని ప్రశ్నించారు. ఐకమత్యమే పార్టీ బలం.. ఈ విషయం రేవంత్ మర్చిపోయారు. రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు కదా? అని పొన్నాల లక్ష్మయ్య నిలదీశారు.