Ponnala | బీసీలను ముంచింది కాంగ్రెస్ పార్టీయేనని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. తెలంగాణ భవన్లో సీనియర్ నేత దాసోజు శ్రవణ్, నందికంటి శ్రీధర్తో కలిసి ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలను మోసం చేయడమే కాకుండా బీసీలు ప్రాతినిథ్యం వహించిన నియోజకవర్గాల సీట్లను రేవంత్రెడ్డి అమ్ముకున్నాడని విమర్శించారు.
వీహెచ్, అంజన్కుమార్, నందికంటి శ్రీధర్, ఎర్ర శేఖర్, సుజాతతో పాటు పలువురు బీసీ నేతలకు టికెట్ల ఇవ్వకుండా.. తన వర్గానికే ఇప్పించుకున్నారని మండిపడ్డారు. టికెట్లనే అమ్ముకున్న వారు బీసీల ప్రయోజనాలను ఎలా కాపాడుతారని ప్రశ్నించారు. కులగణన, కేంద్రంలో బీసీ మంత్రిత్వపై బీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపడంతో పాటు ఎంపీలు పార్లమెంట్ ఉభయసభల్లో డిమాండ్ చేసిన విషయాన్ని నేతలు గుర్తు చేశారు. కాంగ్రెస్, రాహుల్గాంధీ ఏనాడైనా పార్లమెంట్లో బీసీ డిమాండ్లపై స్పందించారా? అంటూ నిలదీశారు.
సీట్లను ఇవ్వని కాంగ్రెస్ పార్టీ రేపు బీసీ రిజర్వేషన్లను చేస్తామంటే నమ్మెదెవరు? అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ 20 మంది బీసీలకు టికెట్స్ ఇస్తే.. 40 మంది రెడ్డి సామాజిక వర్గాకే ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ పొద్దున చేరిక వారికి సాయంత్రం టికెట్లు ఇచ్చిందని విమర్శలు గుప్పించారు. ఒక్కరోజులో టికెట్లు పొందిన వారి పేరుపై ఏం సర్వేలు చేశారంటూ ధ్వజమెత్తారు. ఉదయ్పూర్ డిక్లరేషన్ను తుంగలోకి తొక్కి ఒకే కుటుంబానికి రెండు సీట్లు ఇచ్చారని విమర్శలు గుప్పించారు.