హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): బీసీలను ముంచింది కాంగ్రెస్సేనని బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు. బీసీలకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్న రాహుల్ ప్రకటన పచ్చి బూటకమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం తెలంగాణ భవన్లో పార్టీ సీనియర్ నేత దాసోజు శ్రవణ్, నందికంటి శ్రీధర్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పొన్నాల, దాసోజు మాట్లాడుతూ.. బీసీలు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాల సీట్లను రేవంత్రెడ్డి అమ్ముకున్నారని ఆరోపించారు. వీహెచ్, అంజన్కుమార్, నందికంటి శ్రీధర్, ఎర్ర శేఖర్, గండ్రాత్ సుజాత వంటి బీసీ నేతలకు ఇవ్వాల్సిన టికెట్లను రేవంత్ తన వర్గానికి ఇప్పించుకున్నారని మండిపడ్డారు. బీసీల టికెట్లు అమ్ముకున్న కాంగ్రెస్ వారి ప్రయోజనల కోసం ఎలా పనిచేస్తుందని ప్రశ్నించారు. కులగణన చేయాలని, కేంద్రంలో బీసీ మంత్రిత్వశాఖ ఉండాలని పదేండ్ల క్రితమే బీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ 20 మంది బీసీలకు టికెట్లు ఇస్తే 40 మంది రెడ్డి సామాజిక వర్గాకే ఇచ్చిందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ఇస్తుందని, బీసీ గర్జన చేపడతామని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీని రేవంత్రెడ్డి పచ్చకాంగ్రెస్గా మార్చేశారని పొన్నాల, దాసోజు విమర్శించారు. చంద్రబాబు డైరెక్షన్లోనే రేవంత్ పనిచేస్తున్నారని ఆరోపించారు. రూ. 50 కోట్లకే పీసీసీ పదవి తెచ్చుకున్నాడని రేవంత్పై కోమటిరెడ్డి బ్రదర్స్ ఆరోపించినా.. రేవంత్ వారిపై తిరిగి ఆరోపణలు చేసినా తామంతా ఒకటే అన్నట్టు వ్యవహించారని పేర్కొన్నారు. బీసీలను అవమానాలకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా పదవులు ఇవ్వడమే కాకుండా సామాజికంగా బీసీల అభ్యన్నతికి పాటుపడుతున్నది బీఆర్ఎస్ పార్టీయేనని స్పష్టం చేశారు.