Ponnala Lakshmaiah | నరేంద్ర మోదీ ప్రభుత్వం మాటలు ఎక్కువ.. చేతలు తక్కువని మరోసారి కేంద్ర బడ్జెట్ నిరూపించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమావేశంలో కేంద్ర బడ్జెట్పై స్పందించారు. నిన్న రాష్ట్రపతి ప్రసంగం, నేడు కేంద్ర బడ్జెట్ చూశామన్నారు. కొద్ది మందికి లాభదాయకంగా, రాజకీయ పరంగా ఉపయోగపడేందుకు ఈ బడ్జెట్ రూపొందించారని ఆరోపించారు. గురజాడ అప్పారావు సూక్తి దేశమంటే మట్టి కాదోయ్ మనుషులోయ్ అనే నినాదాన్ని నిర్మలా సీతారామన్ ఉటంకించారని.. బడ్జెట్ మాత్రం ఆ దిశగా లేదన్నారు. మానవతా దృక్పథం ఈ బడ్జెట్లో లోపించిందన్నారు.
సంపన్న వర్గాలకు చెందిన బ్యాంకు రుణాలను మాఫీ చేసిన మోదీ ప్రభుత్వం నిరుపేదలకు ఈ బడ్జెట్లో ఏమిచ్చిందని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో రూపొందిన పథకాల స్ఫూర్తి ఈ బడ్జెట్లో కనిపించిందన్నారు. కేసీఆర్ మిషన్ భగీరథతో వందశాతం గ్రామాలకు తాగునీరు ఇచ్చారన్నారు. కేంద్ర బడ్జెట్లో జల్ జీవన్ మిషన్ కింద వచ్చే ఎనిమిదేళ్లలో వంద శాతం గ్రామాల్లో తాగునీరు ఇస్తామంటున్నారన్నారు. కేసీఆర్ ముందు చూపుతో జిల్లాకో మెడికల్ కాలేజీ స్థాపించి సీట్ల సంఖ్యను 8500 దాకా పెంచారని గుర్తు చేశారు. కేంద్ర బడ్జెట్లో మెడికల్ సీట్లను పెంచుతామని ప్రకటించారన్నారు. పోలవరం గురించి రాష్ట్రపతి ప్రసంగంతో పాటు బడ్జెట్లో ప్రస్తావించారని.. ఏపీ పునర్విభజన చట్టంలో తెలంగాణకు ఇస్తామన్న వాటి గురించి బడ్జెట్లో ప్రస్తావన లేదన్నారు.
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సంగతి లేదని.. మూడు కోట్ల ఇండ్లు కడతామంటున్నారని.. గతంలో చెప్పిన లక్ష్యాలను చేరుకోదని.. ఇపుడు కొత్తగా ఇన్ని కోట్ల ఇండ్లు అంటే నమ్మేదెలా? అని ప్రశ్నించారు. ఉపాధి హామీ పథకం లక్ష్యాన్ని బడ్జెట్ దెబ్బతీసిందన్నారు. జీఎస్టీ ఒకశాతం తగ్గిస్తామంటే చాలా మందికి మేలు జరిగేదని.. బడ్జెట్లో రాజకీయ కోణమే ఎక్కువ కనిపించిందని విమర్శించారు. సంపన్న వర్గాల కోసమే బీజేపీ ఆలోచిస్తుందని ఈ బడ్జెట్ రుజువు చేసిందన్నారు. తెలంగాణ గత పదేళ్లలో అద్భుత ప్రగతి సాధించిందని.. ప్రగతిశీల రాష్ట్రానికి బడ్జెట్లో ఏమీ దక్కలేదన్నారు. బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని బీఆర్ఎస్ పక్షాన ప్రజలకు వివరిస్తామన్నారు.