హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చివరికి సంస్థాగత ఎన్నికలు కూడా సక్రమంగా నిర్వహించలేని దుస్థితికి చేరుకున్నది. పార్టీ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ సందర్భంగా వర్గపోరు ముదిరి ధర్నాల దాకా పోయింది. సోమవారం గాంధీ భవన్లో జరిగిన అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఓటర్ జాబితాలో కొన్నిపేర్లు మాయం కావడం, కొన్ని ప్రత్యక్షం కావడంపై మాజీ మంత్రులు, ఆ పార్టీ సీనియర్ నేతలైన పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ ఏకంగా గాంధీ భవన్ మెట్లపైనే బైఠాయించి ధర్నా నిర్వహించారు. వీరితో పాటు ఉత్తమ్కుమార్రెడ్డి, రేణుకా చౌదరి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, మరికొందరు ఇతర నేతలు ఓటర్ల జాబితా తీరుతెన్నులపై మండిపడ్డారు. రాత్రికి రాత్రే జాబితాలో పేర్లు మాయం కావడం, కొత్తపేర్లు జత కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ భవన్ మెట్ల మీద నిరసన తెలిపే దౌర్భాగ్య పరిస్థితి రావడం బాధాకరంగా ఉన్నదని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఏ కారణం చేత సంజీవరెడ్డి (నారాయణ్ఖేడ్), చెంచారపు శ్రీనివాసరెడ్డి (జనగామ) పేర్లు తొలగించారో తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలకు వివరణ ఇవ్వాలని రాజనర్సింహ, పొన్నాల డిమాండ్ చేశారు. ఇక తెలంగాణ పీసీసీ డెలిగేట్స్ లిస్ట్లో చాలా కొత్త పేర్లు వచ్చాయని, అవి ఎలా వచ్చాయో తెలియవని మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి కూడా జాబితాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డెలిగేట్స్ జాబితాల్లో అవకతవకలపై సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ నేతలు ఇప్పటికే క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేశారు. రేవంత్రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ పార్టీకి గుడ్బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి పేరు జాబితాలోనే ఉండటం చర్చనీయాంశంగా మారింది.