Indiramma Indlu | హైదరాబాద్, మార్చి 6(నమస్తే తెలంగాణ): సొంత జాగా, ఆహారభద్రత కార్డు ఉన్నవారికే ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఆర్థికసాయం మం జూరు చేస్తామని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్పష్టంచేశారు. తొలి విడతలో ఒక్కొక్క నియోజకవర్గంలో 3,500 చొప్పున మొత్తం రాష్ట్రంలో నాలుగున్నర లక్షల మందికి ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పారు. ఈ నెల 11న భద్రాచలంలో రాములోరి సన్నిధిలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ పథకానికి శ్రీకారం చుడతారని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంపై బుధవారం ఆయన సచివాలయంలో హౌసింగ్బోర్డు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల సహాయం అందించడానికి అవసరమైన కార్యచరణ ప్రారంభించిందని చెప్పారు. ఈ పథకాన్ని తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్, జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు పర్యవేక్షిస్తారని తెలిపారు. తొలి విడతలో సొంత స్థలం కలిగిన వారికి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి రూ.5 లక్షల చొప్పున మంజూరు చేస్తామని స్పష్టంచేశారు. 400 చదరపు అడుగులకు తకువ కాకుండా ఇండ్లను నిర్మించాలని, హాలు, బెడ్రూం, వంటగది, బాత్రూం తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. మహిళల పేరు మీదనే ఇండ్లను మంజూరు చేస్తామని, ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఆహార భద్రతకార్డు ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని వివరించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబందించిన మార్గదర్శకాలను వెంటనే విడుదలచేయాలని అధికారులకు సూచించారు.
కేంద్ర మార్గదర్శకాల ప్రకారమే ఇండ్ల మంజూరు
రాష్ట్రంలో గృహనిర్మాణ పథకానికి ఇంకా మార్గదర్శకాలు విడుదల చేయనప్పటికీ ఇవి కేంద్ర మార్గదర్శకాలకు లోబడే ఉంటాయని అధికారవర్గాలు చెప్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిధులు వినియోగించుకోవాలంటే వారు సూచించిన మార్గదర్శకాలను పాటించాల్సిందేనని స్పష్టంచేస్తున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా కేంద్రం పేదల గృహ నిర్మాణానికి రాష్ర్టాలకు నిధులు అందజేస్తున్నది. కనీసం 350 చదరపు అడుగుల విస్తీర్ణంలో వంటగది, ఒక పడకగది, టాయిలెట్, ఒక హాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. తప్పనిసరిగా మహిళ పేరుతోనే ఇల్లు మంజూరు చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క ఇంటికి రూ.2.5 లక్షల వరకు కేంద్రం భరిస్తున్నది. ఆ నిధులు రావాలంటే రాష్ర్టాలు చేపట్టే గృహనిర్మాణ ప్రాజెక్టులు కేంద్ర మార్గదర్శకాలకు లోబడి ఉండాలి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కేంద్ర మార్గదర్శకాలకు లోబడే రాష్ట్రంలో గృహనిర్మాణ పథకాన్ని అమలుచేసేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఈ ఏడాది 4.5 లక్షల ఇండ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం, గృహనిర్మాణానికి బడ్జెట్లో రూ.ఏడు వేల కోట్లు మాత్రమే కేటాయించింది. మిగిలిన మొత్తాన్ని కేంద్ర సహాయంగా, హడ్కో నుంచి రుణంగా సేకరించాలని నిర్ణయించింది.