పల్లెప్రగతితో మారిన రూపురేఖలు
పూర్తయిన పల్లె ప్రకృతివనం, సెగ్రిగేషన్ షెడ్డు
రూ.24 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం పూర్తి
ఆత్మకూరు, మే 11: పల్లెప్రగతితో గ్రామాలు కొత్తరూపు సంతరించుకుంటున్నాయి. అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించుకుంటున్నారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలోని ఆరెపల్లి గ్రామం ప్రగతి పథంలో దూసుకెళ్తున్నది. పల్లెప్రకృతి వనం , సెగ్రిగేషన్ షెడ్డు, సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు పూర్తయ్యాయి. వైకుంఠధామం పనులూ కొనసాగుతున్నాయి.
పల్లెలన్నీ అభివృద్ధి చెందాలని ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమం ప్రవేశపెట్టడంతో ప్రతిఫలం కనిపిస్తున్నది. మండలంలోని ఆరెపల్లి గ్రామ పంచాయతీ ప్రగతిపథంలో దూసుకపోతున్నది. వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం, డంపింగ్యార్డు, వైకుంఠధామం అందుబాటులోకి వచ్చాయి. ప్రజలకు స్వచ్ఛమైన భగీరథ తాగునీరు అందుతున్నది. అంతర్గతరోడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. గ్రామంలో 3వేల జనాభా ఉండగా 1,994మంది ఓటర్లు ఉన్నారు. 521నివాస గృహాలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి రూ.3లక్షల వరకు నిధులు వస్తున్నాయి. పంచాయతీ పాలకవర్గం నిధులను సద్వినియోగం చేసుకోవడంలో సఫలీకృతులయ్యారు. పారిశుధ్య పనులు, మొక్కల సంరక్షణ తదితర కార్యక్రమాలతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు. వర్షం వస్తే బురదమయంగా మారే రోడ్లు నేడు అద్దంలా మెరుస్తున్నాయి. డంపింగ్యార్డును అందుబాటులోకి తెచ్చి చెత్తను సేకరిస్తుండడంతో ఊరంతా శుభ్రమైన వాతావరణం నెలకొన్నది. గ్రామ పంచాయతీ ట్రాక్టర్ను గ్రామ అభివృద్ధికి, పారిశుధ్య పనులకు వినియోగిస్తున్నారు. ట్రాక్టర్కు ఏర్పాటు చేసిన నీళ్ల ట్యాంకర్తో రోజు విడిచి రోజు మొక్కలకు నీళ్లు పోస్తున్నారు. ఇప్పటికే గ్రామంలో పాడుపడిన బావులు, ఇండ్లను తొలగించారు. రూ.2.50 లక్షలతో మూడు అంతర్గత మట్టిరోడ్లను వేయించారు. మూడు ప్రధాన సీసీరోడ్లను రూ.9లక్షలు వెచ్చించి నిర్మించారు. రూ.15లక్షలతో డ్రైనేజీలను నిర్మించారు. మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నారు. గ్రామస్తులకు ఆహ్లాదం పంచేందుకు ప్రకృతివనాన్ని నిర్మించి 2వేల మొక్కలు నాటి పెంచుతున్నారు.
వైకుంఠధామానికి తొలగిన ఇబ్బందులు
గ్రామంలో శ్మశానవాటికకు ఇబ్బందులు ఉండేవి. ఉన్న కొంత ప్రభుత్వ భూమిలో చుట్టు పక్కల వ్యవసాయ పొలాలవారి నుంచి ఆక్షేపనలు ఉండేవి. ఓ దశలో వివాదాలు జరిగిన ఘటనలు ఉన్నాయి. అధికారుల సహకారంతో ఆక్రమణలను తొలగించి ఉన్న కొద్ది స్థలాన్ని శ్మశానవాటికకు కేటాయించారు. అందులోనూ బాట పంచాయతీ నెలకొనగా ఈ మధ్య గ్రామపెద్దలు, పంచాయతీ పాలకవర్గం చర్చలు నిర్వహించి బాట పంచాయితీని పరిష్కరించారు. వైకుంఠధామం నిర్మాణంతో ఏండ్లుగా పీడిస్తున్న సమస్య తీరిపోయినట్లయిందని గ్రామస్తునలు అంటున్నారు.
స్వచ్ఛత దిశగా..
మా పంచాయతీని స్వచ్ఛత దిశగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వ సహకారంతో ముందు కెళ్తున్నాం. సర్కారు నుంచి మంజూరైన నిధులతో పంచాయతీలో రైతువేదిక, ప్రకృతివనం, వైకుంఠధామం, డంపింగ్యార్డు నిర్మించుకున్నాం. ఎక్కడా అపరిశుభ్రతకు తావులేకుండా నిత్యం పారిశుధ్య పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నాం. తడి, పొడి చెత్త వేసేందుకు ఇంటింటికీ చెత్త బుట్టలు పంపిణీ చేశాం. పరిశుభ్రతపై గ్రామస్తులకు అవగాహన కల్పిస్తున్నాం.