హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు? అధిష్ఠానం ఆలోచనలు ఎలా ఉన్నాయి? సర్వేల అంచనాలు ఏమంటున్నాయి? మునుగోడుకు జరిగే ఉప ఎన్నికలో టీఆర్ఎస్ టికెట్ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికే దక్కొచ్చని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వివిధ సర్వేల్లోనూ, అధిష్ఠానం అభిప్రాయ సేకరణలోనూ ఆయన పేరే ప్రముఖంగా వినిపిస్తున్నట్టు పేర్కొంటున్నాయి. మునుగోడులో ఉప ఎన్నిక ఖాయమని స్పష్టం కావడంతోనే టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనే చర్చ మొదలైంది. గుత్తా సుఖేందర్రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, కర్నె ప్రభాకర్ పేర్లు ప్రధానంగా ప్రచారంలోకి వచ్చాయి.
ఇప్పుడున్న పరిస్థితుల్లో టికెట్ దక్కే అవకాశాలు కూసుకుంట్లకే ఎక్కువగా ఉన్నట్టు అధిష్ఠానానికి దగ్గరగా ఉండే పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అధిష్ఠానం చేయించిన సర్వేల్లో ఆయనవైపే ప్రజల మొగ్గు కనిపించినట్టు అవి వెల్లడించాయి. ‘కూసుకుంట్ల తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. అనేకసార్లు జైలుకు వెళ్లారు. ఇల్లందకుంట వద్ద జరిగిన ఉద్యమంలో నమోదైన కేసులో ఆయన ఏకంగా 28 రోజులు జైల్లో ఉన్నారు. అందువల్ల సహజంగానే ఆయన న్యాచురల్ చాయిస్ అవుతారు’ అని పార్టీ ముఖ్యుడొకరు వివరించారు. పార్టీకి, నాయకత్వానికి ప్రభాకర్రెడ్డి పూర్తి విధేయుడు.
2018లో ఓడిపోయినప్పటికీ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఆయనను అనవసరంగా ఓడించామే అన్న సానుభూతి కూడా కూసుకుంట్లకు అనుకూలంగా పనిచేస్తున్నది. ఉద్యమ నేపథ్యం ఆయనకు అదనపు బలం అని కూడా పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మునుగోడు అభ్యర్థిపై జిల్లా మంత్రి, ఇతర నేతల నుంచి అధిష్ఠానం అభిప్రాయ సేకరణ చేసినప్పుడు ఆయనకు ఇవ్వడమే సరైనదన్న మాట వ్యక్తమైందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. టికెట్ లభిస్తుందని ప్రచారంలో ఉన్న మిగతా ముగ్గురికీ కలిపి వ్యక్తమైన సానుకూలతకన్నా, ఒక్క ప్రభాకర్రెడ్డి పట్ల సర్వేల్లో ఎక్కువ సానుకూలత కనిపించినట్టు పార్టీ అధిష్ఠానానికి దగ్గరగా ఉండే నాయకుడొకరు చెప్పారు.
ఇప్పుడు ‘గుత్తా’ స్థాయికి తగదు
మునుగోడు టికెట్ దక్కొచ్చనే ప్రచారంలో ఉన్న పేర్లలో గుత్తా సుఖేందర్రెడ్డి నల్లగొండ జిల్లాలో సీనియర్ నాయకుడు. జిల్లా వ్యాప్తంగా ఆయనకు చాలా మంచి పేరున్నది. ప్రతి గ్రామంలోనూ ఆయనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. టీఆర్ఎస్లో చేరిన తర్వాత సీఎం కేసీఆర్ ఆయనకు తగిన గౌరవం ఇచ్చారు. రైతుబంధు సమితికి మొట్టమొదటి అధ్యక్షుడిగా అవకాశం కల్పించారు. ఇటీవలే ఎమ్మెల్సీగా చేసి శాసన మండలి చైర్మన్ను చేశారు. ఉన్నతమైన పదవిలో ఉన్న ఆయనను చిన్న ఉప ఎన్నిక కోసం కదిలించడం సరికాదన్నది పార్టీ వర్గాల అభిప్రాయమని తెలిసింది. ఒక ఉప ఎన్నిక కోసం అంత పెద్ద వ్యక్తిని నిలపాల్సిన అవసరం ఉన్నదా? అన్న చర్చ పార్టీలో సాగుతున్నది. అంతేకాదు.. నియోజకవర్గ వ్యా ప్తంగా గుత్తాకు మంచి పేరున్నా, స్థానికేతరుడనే చిన్న లోపం వెంటాడుతున్నదని సర్వేల్లో తేలినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
‘బూర’కు పెద్ద బాధ్యతలు
మరో నేత బూర నర్సయ్యగౌడ్ కూడా తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రికి సన్నిహితుడు. ‘డాక్టర్స్ ఆఫ్ తెలంగాణ’ను ఏర్పాటు చేసి, ఉద్యమానికి మేధావుల మద్దతు కూడగట్టడంలో, వైద్యులందరినీ ఏకతాటిపైకి తెచ్చి ప్రత్యక్షంగా పోరాటంలో పాల్గొనేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు. మేధోపరంగా సీఎం కేసీఆర్కు అనేక అంశాల్లో సలహాలు, సూచనలు చేశారు. అందుకే ఆయన సేవలకు గుర్తింపుగా 2014లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థిగా బూరను సీఎం బరిలో నిలిపారు. ఆ ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. 2019లోనూ మరోసారి అవకాశం ఇచ్చినా.. స్వల్ప తేడాతో ఓటమి చెందారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఆయన భువనగిరి ఎంపీ స్థానానికి పోటీపడే అవసరం రావొచ్చని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మరో ఏడాదిన్నరలో లోక్సభ ఎన్నికలున్నాయి.
ఈ నేపథ్యంలో భువనగిరి లోక్సభ స్థానంలో తన పొజిషన్ను బూర మరింత కన్సాలిడేట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నదన్నది పార్టీ అభిప్రాయంగా కనిపిస్తున్నది. పూర్తి సమయాన్ని, శక్తియుక్తుల్ని భువనగిరిలో వెచ్చిస్తే అది ఆయన విజయానికే కాకుండా, పార్టీకి కూడా ఎంతో లాభదాయకం అవుతుందని అధిష్ఠానం భావిస్తున్నట్టు సమాచారం. బూర సేవల్ని భువనగిరి నుంచి వాడుకోవడమే శ్రేయస్కరమని అధిష్ఠానం ఆలోచిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇలాంటి సమయంలో ఆయనకు మునుగోడు టికెట్ ఇవ్వడం సరికాదని జిల్లా పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. ఆయన మునుగోడు ప్రజలకు సుపరిచితుడే అయినా మునుగోడులో బూర స్థానికేతరుడనే అంశం కూడా కాస్త ప్రతికూలంగా ఉన్నదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
రాబోయే కాలంలో ‘కర్నె’ కీలకం
కర్నె ప్రభాకర్ కూడా మొదటినుంచీ సీరియస్గా ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ నియోజకవర్గానికి చెందినవారు. సీఎం కేసీఆర్ ఆయన ప్రతిభకు గుర్తింపుగా పార్టీలో అనేక అవకాశాలు ఇచ్చా రు. టీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడిగా, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ఎమ్మెల్సీగా, శాసన మండలిలో విప్గా, పార్టీ అధికార ప్రతినిధిగా.. ఇలా అనేక హోదాల్లో పనిచేశారు. సీఎం కేసీఆర్కు సన్నిహితుల్లో ఒకడిగా పేరున్నది. అయితే, సామాజిక సమీకరణాలు ఆయనకు డ్రాబ్యాక్గా కనిపిస్తున్నాయని, ఆ దృష్ట్యా చూసినప్పుడు కర్నె ప్రభాకర్కు మునుగోడు అంత అచ్చిరావడం లేదన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతున్నది.
మరో రెండేండ్లలో వరుసగా అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలున్న నేపథ్యంలో పార్టీ వాయిస్ని, వాదనను జనంలోకి తీసుకెళ్లే ప్రక్రియలో కర్నె ప్రభాకర్ పాత్ర కీలకమవుతుందని, అందువల్ల ఆయనను మునుగోడుకు పరిమితం చేయడం సరికాదని పార్టీ ముఖ్యులు భావిస్తున్నట్టు తెలిసింది. మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలున్న తరుణంలో ఈ ఉప ఎన్నికలు విపక్షాలు సెమీ ఫైనల్గా ప్రచారం చేసే అవకాశం ఉన్నదని, అందువల్ల ఇప్పుడు అధిష్ఠానం ఎట్టి పరిస్థితుల్లోనూ రిస్క్ చేయలేదని కీలక నేత ఒకరు వివరించారు.
నిత్యం ప్రజల్లోనే కూసుకుంట్ల
మునుగోడు నియోజకవర్గ ప్రజలకు కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి చిరపరిచితుడు. టీఆర్ఎస్ పెట్టినప్పటి నుంచి సీఎం కేసీఆర్ వెంటే ఉన్న నేతల్లో ఒకరు. తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా పనిచేశారు. అనేకసార్లు జైలుకు కూడా వెళ్లారు. సీఎం కేసీఆర్కు సన్నిహితుడుగా పేరున్నది. ఆయన 2014 ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యేగా పనిచేశారు. 2018 ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసినా ఓడిపోయారు. అయినా ఆయన ఎప్పుడూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోనే ఉన్నారని సర్వేలో నేతలు చెప్పినట్టు సమాచారం. పార్టీకి, నాయకత్వానికి విధేయుడనే పేరు కూడా ఉన్నదని, అందుకే గత ఎన్నికల్లో ఓడిపోయినా ఆయనవైపే అధిష్ఠానం మొగ్గు చూపే అవకాశం ఉన్నదని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది.
కూసుకుంట్లకు వ్యక్తిగతంగా ప్రజల్లో మంచి పేరు ఉండటంతోపాటు గత ఎన్నికల్లో ఓడిపోయాడనే సానుభూతి సైతం కలిసి వస్తాయని నేతలు చెప్పుకొంటున్నారు. మునుగోడులో వ్యక్తులే కాక పార్టీ కూడా చాలా బలంగా ఉన్నదని, దానికి అభ్యర్థి బలం, బలగం కూడా తోడై, సీనియర్ నాయకులు పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణితో కొంత సర్దుబాటు చేసుకుని సమన్వయంతో పని చేస్తే విజయం నల్లేరు మీద నడక అవుతుందని, బ్రహ్మాండమైన మెజార్టీతో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని అధిష్ఠానం ఆలోచిస్తున్నది. అందువల్ల సామాన్య ప్రజల్లో పట్టున్న నాయకుడి వైపే అధిష్ఠానం మొగ్గు ఉంటుందని పార్టీ ముఖ్యుడొకరు చెప్పారు. ప్రస్తుతానికైతే అధిష్ఠానం అన్ని పేర్లనూ పరిశీలిస్తున్నదనీ, అభ్యర్థిపై తుది నిర్ణయం, ప్రకటన త్వరలోనే వెలువడుతుందని ఆయన వెల్లడించారు.