హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణను సాధించిన కేసీఆర్పై అసభ్య పదజాలం ప్రయోగించిన సీఎం రేవంత్పై పోలీసులు ముందుగా కేసు నమోదుచేయాలన్నారు. లేదంటే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే, దళిత బిడ్డ బాల్క సుమన్పై ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదుచేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్ వేదికగా) ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవలంభించిన విధానాలనే ప్రస్తుత ప్రభుత్వం అవలంభిస్తున్నదని విమర్శించారు. తెలంగాణలో ఉన్న ఢిల్లీ రిమోట్ కంట్రోల్ పాలన రాచరిక వ్యవస్థను తలపిస్తున్నదని విమర్శించారు. సూర్యునిపై ఉమ్మేస్తే అది తిరిగి మీ మీదే పడుతుందన్న విషయాన్ని మర్చిపోవద్దన్నారు. బీఆర్ఎస్ అధినేతపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని చెప్పారు.
బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే , దళిత బిడ్డ బాల్క సుమన్ పై ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు.
నాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అవలంభించిన విధానాలనే నేడు తెలంగాణలో ఉన్న ఢిల్లీ రిమోట్ కంట్రోల్ పాలన కూడా అవలంభించడం రాచరిక వ్యవస్థను తలపిస్తుంది.…
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 6, 2024