హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియలో కీలకమైన దేహదారుఢ్య పరీక్షలు (ఫిజికల్ ఈవెంట్స్) సజావుగా ముగిశాయి. మెయిన్స్ పరీక్షకు 1,11,209 మంది అర్హత సాధించినట్టు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) శుక్రవారం ప్రకటించింది. గతనెల 8 నుంచి ఈ నెల 5 వరకు రాష్ట్రవ్యాప్తంగా 11 ప్రాంతాల్లో నిర్వహించిన ఫిజికల్ ఈవెంట్స్కు 2,07,106 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 17,516 ఉద్యోగాలకు 1.11 లక్షలమంది పోటీపడనున్నారు. 554 ఎస్సై పోస్టులకు 52,786 మంది, 15,644 కానిస్టేబుల్ పోస్టులకు 90,488 మంది, 614 ఆబారీ కానిస్టేబుల్ పోస్టులకు 59,325 మంది అభ్యర్థులు తుది పరీక్షలు రాయనున్నారు.
తొలిసారి అత్యాధునిక సాంకేతికత
ఫిజికల్ ఈవెంట్స్ కోసం తొలిసారి అత్యాధునిక టెక్నాలజీని వినియోగించారు. ప్రక్రియ అంతా సీసీ కెమెరాల్లో రికార్డు చేశారు. పూర్తిస్థాయిలో సాంకేతికతను ఉపయోగించి ఫిజికల్ ఈవెంట్లలో పొరపాట్లకు తావులేకుండా పూర్తిచేశారు. లాంగ్ జంప్, షాట్ఫుట్లో ఒకొకరికి మూడుసార్లు అవకాశం ఇచ్చారు. మొత్తం 53.7 శాతం మంది క్వాలిఫై అయినట్టు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది.
వదంతులు అవాస్తవం
లాంగ్జంప్లో ఎక్కువమంది అనర్హత సాధించారని కొందరు వదంతులు సృష్టిస్తుండటంతో బోర్డు స్పష్టత ఇచ్చింది. ప్రతి 100 మంది అభ్యర్థులకు 83 మంది లాంగ్జంప్లో క్వాలిఫై అయ్యారని, కేవలం 17శాతం వారి కోసమే కొందరు రాజకీయం చేస్తున్నారని తెలిపింది. తొలిసారి ప్రతి అభ్యర్థికి డిజిటల్ ఆర్ఎఫ్ఐడీ రిస్ట్బ్యాండ్ను అందించామని పేర్కొన్నది. షాట్ఫుట్లో 91శాతం మంది పురుషులు, 96 శాతం మహిళలు అర్హత సాధించారని, ఎక్కడా లోపాలు జరగకుండా ఎత్తు కొలిచేందుకు కూడా డిజిటల్ యంత్రాలను వినియోగించినట్టు అధికారులు చెప్పారు. ఎత్తు విషయంలో పలువురు వ్యక్తం చేసిన అనుమానాలను నివృత్తి చేశామని పేర్కొన్నారు. ప్రిలిమినరీ రాత పరీక్షకు కూడా బయోమెట్రిక్ విధానం అమలు చేసినట్టు వివరించారు.
మార్చి నుంచి తుదిరాత పరీక్షలు
మార్చి 2వ వారంలో తుది రాత పరీక్షలు నిర్వహించనున్నట్టు ఇప్పటికే ప్రకటించిన టీఎస్ఎస్ఆర్బీ ఇందుకు సంబంధించి ఏర్పాట్లు మొదలుపెట్టింది. ప్రధానంగా చాలా విభాగాల్లో పోస్టులకు హైదరాబాద్లోనే పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. పెద్ద సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యే కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించిన రాత పరీక్షను ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. మెయిన్స్ రాతపరీక్షకు క్వాలిఫై అయిన అభ్యర్థులకు దాదాపు 60 రోజులకు పైగా సమయం ఉండటంతో వారంతా చదువుపై దృష్టి సారించారు.