వరంగల్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): టెన్త్ హిందీ పేపర్ ఫొటోలను సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేసిన కేసులో బీజేపీ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ను వరంగల్ పోలీసులు ప్రశ్నించారు. ఈ కేసు విచారణ కోసం సోమవారం వరంగల్ పోలీసు కమిషరేట్లోని సెంట్రల్ జోన్ డీసీపీ కార్యాలయానికి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వచ్చారు. సెంట్రల్ జోన్ డీసీపీ బారి, కాజీపేట ఏసీపీ శ్రీనివాస్ పర్యవేక్షణలో కమలాపూర్ ఇన్స్పెక్టర్ సంజీవ్.. ఈటలను విచారించారు. ‘మీ సెల్ఫోన్ వాట్సాప్కు హిందీ పేపర్ను ఎవరు పంపారు? కేసులో రెండో నిందితుడు బూరం ప్రశాంత్ పంపారా? మీకు వాట్సాప్లో వచ్చిన పేపర్ను మీరు ఇంకెవరికైనా ఫార్వర్డ్ చేశారా? పేపర్ లీకేజీ విషయంలో ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడారా’ అని ఈటలను ప్రశ్నించారు.
‘ఈ కేసులో మూడో నిందితుడిగా ఉన్న గుండెబోయిన మహేశ్ వాట్సాప్లో హిందీ ప్రశ్నపత్రం పంపించాడు. దాన్ని ఓపెన్ కూడా చేయలేదు. నాకు వచ్చిన ఫోన్లు మాట్లాడటం, కాల్ చేయడం తప్ప వాట్సాప్లో మెసేజ్లు పంపించడం అలవాటు లేదు. అంతా పీఏలు చూసుకుంటారు..’ అని ఎమ్మెల్యే ఈటల సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. అనంతరం ఈటల సెల్ఫోన్ను చూపించాలని పోలీసులు సూచించారు. ఈటల డీసీపీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చి అక్కడ ఉన్న పీఏను లోపలికి తీసుకెళ్లి పీఏతో తన ఫోన్లో మహేశ్ పంపించిన హిందీ ప్రశ్నపత్రం మెసేజ్ను పోలీసులకు చూపించినట్టు తెలిసింది. ఈటల చెప్పిన విషయాలను విచారణ అధికారి సంజీవ్ నమోదు చేశారు. విచారణ గంటపాటు సాగింది.