ఆదిలాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ)/ నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 28 : దుక్కులు సిద్ధం చేసి, విత్తనాల కోసం పోతే రైతులకు నరకయాతన తప్పడం లేదు. ఆదిలాబాద్లో మంగళవారం పత్తివిత్తనాల కోసం ఎండను లెక్కచేయకుండా గంట ల తరబడి బారులు తీరిన రైతులపై పోలీసులు చిందులు తొక్కారు. ఒకానొక దశలో తోపులాట జరగడంతో లాఠీలతో చెదరగొట్టారు. ఆరురోజులుగా ఎదురుచూస్తున్న ఆర్సీహెచ్ 659 రకం పత్తి విత్తనాల స్టాక్ మంగళవారం వచ్చిందని తెలిసి వేలాది మంది రైతులు ఉదయం ఆరు గంటల నుంచే పలు కేంద్రాల వద్దకు చేరుకున్నారు. తిండీ తిప్పలు లేక లైన్లలో నిరీక్షించారు. చాలా దుకాణాలను స్టాక్ లేదని మూసేయడంతో ఓ సెంటర్ వద్దకు రైతులు ఒక్కసారిగా దూసుకువచ్చారు. కొంత తోపులాట జరగడం తో పోలీసులు వచ్చి లాఠీలతో అదిలించారు. పెద్ద సంఖ్యలో పహారాకాస్తూ విత్తన విక్రయాలను కొనసాగించారు. కేంద్రాల వద్ద ఆధార్ కార్డులతో మహి ళా రైతులు, వృద్ధులు, యువకులు, పిల్లలు సైతం విత్తనాల కోసం క్యూ కట్టారు. మండుటెండలో తిండీతిప్పలు మరిచి, కనీసం తాగునీరు, నీడ వసతి లేక ఇబ్బందులు పడ్డారు.
పత్తి విత్తనాల కోసం దాదాపు 4గంటల దాకా క్యూ కట్టినా ఒక్కో రైతుకు వ్యాపారులు 2ప్యాకెట్లు మాత్రమే విక్రయించారు. కొన్ని దుకాణాల్లో గంట లోనే విత్తనాలు అయిపోవడంతో చాలామందికి నిరాశతో వెనుదిరిగారు. స్టాక్ తక్కువ ఇచ్చారని, మొత్తం అమ్మేశామని వ్యాపారులు అమ్మకాలు నిలిపివేయడంతో రైతులు మరో దుకాణం వైపు పరుగు లు తీయడం కనిపించింది. ఒక్కొక్కరికి 5 నుంచి 8 ప్యాకెట్లు అవసరముంటే కేవలం రెండే ఇస్తే ఎలా అని పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలో దుకాణాలు ఎక్కువగా ఉండే గాంధీచౌక్ ప్రాంతంలో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
వడ్లు, పత్తి, మక్క, సోయాబీన్ తదితర విత్తనాలే కాదు.. కనీసం పచ్చిరొట్ట, జీలుగ, జనుము విత్తనాలు కూడా లేక అన్నదాతలు అరిగోస పడుతున్నారు. డిమాండ్కు సరిపడా సరఫరా చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం కావడంతో మంగళవారం రాష్ట్రమంతటా మండుటెండలో వ్యవసాయ శాఖ కార్యాలయాలు, గోడౌన్లు, ఆగ్రోస్, డీసీఎమ్మెస్ దుకాణాలు, సహకార సంఘాల వద్ద పడిగాపులు కాశారు. గంటల తరబడి క్యూలో ఉండలేక పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆధార్కార్డులు వరుసలో పెట్టి తమ వంతు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి ఏడీఏ కార్యాలయానికి పచ్చిరొట్ట విత్తనాల కోసం పరిసర గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పోలీస్ పహారా నడుమ టోకెన్లు, విత్తనాల పంపిణీ కొనసాగినా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం గుంపెన సొసైటీ కార్యాలయం ఎదుట పచ్చిరొట్ట విత్తనాల కోసం రైతులు పొద్దంతా ఎదురుచూసినా దొరక్కపోవడంతో ఇంటిబాట పట్టారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ వ్యవసాయ గోడౌన్ ఎదుట రైతులు పచ్చిరొట్ట కోసం క్యూ కట్టడం కనిపించింది. ఎండకు తాళలేక పాస్బుక్ జిరాక్స్లు వరుసలో ఉంచారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్లోని రెండు ఆగ్రోస్ కేంద్రాల వద్ద జనుము, జీలుగు విత్తనాల కోసం ఉదయం 6గంటల నుంచే లైన్లు కట్టారు.
పట్టాదారు పాస్బుక్, ఆధార్ జిరాక్స్లను లైన్లో పెట్టి ఎదురు చూసినా రెండెకరాలకు ఒకటే బస్తా ఇవ్వడంతో గొణుగుకుంటూ వెనుదిరిగారు. చాలా మంది ఉత్త చేతులతోనే ఇండ్లకు వెళ్లారు. మెదక్ జిల్లా పాపన్నపేటలోని ఆగ్రోస్ సెంటర్, కొత్తపల్లి సహకార సంఘం వద్ద జీలుగ విత్తనాల కోసం రైతులకు ఎదురుచూపులు తప్పలేదు. ఎండ తీవ్రంగా ఉండటంతో పాస్ పుస్తకాలను లైన్లో ఉంచి నిరీక్షించారు. ఖమ్మం జిల్లా బోనకల్లో ఓ విత్తన డీలర్ వద్ద ఉదయం నుంచే పత్తి విత్తనాల కోసం రైతులు క్యూకట్టినా దొరక్కపోవడంతో చాలామంది నిరాశతో వెనుదిరిగారు.
ఆదిలాబాద్లో విత్తనాల కోసం వచ్చిన రైతులపై పోలీసులు లాఠీచార్జి చేయలేదు. పోలీసులు రైతులను చెదరగొట్టారనే విషయంలో నిజం లేదు. పంపిణీ కేంద్రాల వద్ద ఎలాంటి తోపులాట జరుగలేదు. దుకాణాల వద్ద రైతులను క్రమబద్ధీకరించేందుకే పోలీసులు విధులు నిర్వర్తించారు. రైతులు ప్రశాంత వాతావరణంలో విత్తనాలు కొన్నారు. తప్పుడు వార్తలు ప్రసారం చేసిన మీడియా ప్రతినిధులపై చర్యలు తీసుకుంటాం.
– ఎస్పీ గౌష్ ఆలం, ఆదిలాబాద్
ఇప్పటి పరిస్థితి చూస్తుంటే మళ్లీ పాతరోజులు వచ్చినయనిపిస్తున్నది. పోయినేడు ఇట్ల లైన్లో నిలబడలేదు. ఇప్పుడు జీలుగ, జనుము విత్తనాల కోసం కూడా గంటల తరబడి నిలబడే దుస్థితి వచ్చింది. కేసీఆర్ సారు ఉన్నప్పుడు ఇట్ల ఎప్పుడూ లైన్లో నిలబడే పరిస్థితి రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్ల వచ్చిందో లేదో రైతులకు గడ్డుకాలం దాపురించింది.
-సొంగ వెంకటేశం, రైతు, పుల్కల్, సంగారెడ్డి జిల్లా
నాకు 20 ఎకరాల భూముంది. కనీసం పది విత్తన ప్యాకెట్లు అవసరం. మూడు రోజుల నుంచి విత్తన ప్యాకెట్ల కోసం ఆదిలాబాద్ వచ్చిపోతున్న. ఇయ్యాల విత్తనాలు వస్తాయంటే పొద్దున ఆరు గంటలకే వచ్చిన. నేను వచ్చే సరికే ఇక్కడ పెద్ద లైన్ ఉంది. వృద్ధున్ని ఎండలో లైన్లో ఉండలేను అన్నా వినలేదు. లైన్లో ఉంటెనే విత్తనాలు ఇస్తామన్నరు. కేసీఆర్ ప్రభుత్వ హయం లో ఎప్పుడూ విత్తనాల కోసం ఇంత గోస పడలేదు.
-స్వామి, రైతు, కుతులాపూర్, తలమడుగు మండలం, ఆదిలాబాద్ జిల్లా
మాకు తొమ్మిదెకరాల భూముంది. పత్తివిత్తనాల కోసం నాలుగు రోజుల నుంచి తిరుగుతున్న. ఇయ్యాల పొద్దుగాల ఏడు గంటలకచ్చి లైన్ కట్టిన. తిండి, తిప్పులు, నీళ్లు లేక ఎండలో నెరివడితే రెండు ప్యాకెట్లిచ్చిండ్రు. నాకు ఐదు ప్యాకెట్లు కావాలంటే ఎక్కువ ఇయ్యమన్నరు. పత్తి విత్తనాలు మళ్ల అమ్ముతరో లేదో తెలుస్తలేదు. ఇంతకు ముందు విత్తనాలు మంచిగ దొరికినయ్. ఎన్ని కావాలంటే అన్ని తీసుకుపోయినం. ఇప్పుడెందుకిట్ల చేస్తున్నరో తెలుస్తలేదు.
– పుష్ప, రైతు, పిప్పల్కోటి, భీంపూర్ మండలం, ఆదిలాబాద్ జిల్లా