హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): విధి నిర్వహణలో పోలీసుల సేవలు అనిర్వచనీయమని, పౌరుల భద్రత, నేర నివారణ, శాంతిభద్రతల పరిరక్షణలో జీవితాలను తృణప్రాయంగా అర్పించిన పోలీసుల త్యాగం అజరామరమని సీఎం కసీఆర్ పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం (అక్టోబర్ 21) సందర్భంగా అమరులైన పోలీసులకు సీఎం కేసీఆర్ నివాళులర్పించి పోలీసుల త్యాగాలను స్మరించుకొన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలనైనా అర్పించేందుకు సిద్ధపడే పోలీసుల త్యాగం, దేశ రక్షణ కోసం పోరాడే సైనికుల త్యాగాలతో సమానమైనవని చెప్పారు. ప్రశాం త వాతావరణంతోనే రాష్ట్రం ప్రగతి సాధిస్తున్నదంటూ హోంమంత్రి, డీజీపీ, పోలీసు ఉన్నతాధికారులను సీఎం అభినందించారు. శాంతిభద్రతల పరిరక్షణ,సమాచార సమన్వయం దేశానికే ఆదర్శంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ను నిర్మించామని, అత్యున్నత సాంకేతికతతో పోలీసులు సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. పోలీ సు కుటుంబాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని పునరుద్ఘాటించారు.