భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని చర్ల మండలం చెన్నాపురం వద్ద ఏర్పాటు చేసిన సీఆర్పీఎఫ్ క్యాంపు నిర్మాణం పూర్తి కావడంతో బుధవారం రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి, సీఆర్పీఎఫ్ డీజీపీ కుల్దీప్ సింగ్ హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్ ద్వారా చెన్నాపురం చేరుకుని అధికారికంగా సీఆర్పీఎఫ్ క్యాంపు ను ప్రారంభించారు.
ఇద్దరు డీజీపీలతో పాటు అడిషనల్ డీజీపీ ఎస్.ఎస్ చతుర్వేది, సౌత్ జోన్ సీఆర్పీఎఫ్ అడిషనల్ డీజీ నళినీ ప్రభాత్,సదరన్ సెక్టార్ సీఆర్పీఎఫ్ ఐజీ మహేష్ చంద్ర లడ్డా, కుంట సీఆర్పీఎఫ్ డీఐజి రాజీవ్ కుమార్ ఠాకూర్,డీఐజి ఎస్.ఎన్ మిశ్రా, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ముందుగా జిల్లా ఎస్పీ డా.వినీత్ డీజీపీలకు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం అధికారులందరూ క్యాంప్ పరిసరాలు, అధికారులు, సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించారు.
ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. మావోయిస్టు వ్యవస్థ నిర్మూలన కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బలగాలను పటిష్టం చేసేందుకు గాను ప్రత్యేకంగా క్యాంపులను ఏర్పాటు చేసిందన్నారు.
అందులో భాగంగా జిల్లాలోని చెన్నాపురం, పూసుగుప్ప, ఉంజుపల్లి, చెలిమల, తిప్పాపురం, కలివేరు క్యాంపులను ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు. జిల్లా పోలీసు యంత్రాంగం, సీఆర్పీఎఫ్ బలగాల సమన్వయంతో ఛత్తీస్ఘఢ్-తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలపై నిఘా ఏర్పాటు చేశాం.
వారిని కట్టడి చేసేందుకు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నారన్నారు. అమాయకపు ఆదివాసీ గిరిజనులపై దుశ్చర్యలకు పాల్పడుతున్న మావోయిస్టులు తెలంగాణలో ఆదరణ కోల్పోయారని అన్నారు.