ఫర్టిలైజర్సిటీ, మే 8: మంథని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధును పోలీసులు పట్టుకున్నారు. వారం రోజులుగా పుట్ట మధు కనిపించడం లేదనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని భీమవరంలో రామగుండం టాస్క్ఫోర్స్ పోలీసులు ఆయనను శనివారం అదుపులోకి తీసుకున్నారు. పలు అంశాలపై విచారణ కోసం రామగుండం కమిషనరేట్కు తరలించారు. న్యాయవాదులు గట్టు వామనరావు దంపతుల హత్యతోపాటు వామనరావు తండ్రి కిషన్రావు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేస్తున్నారు.
పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఫిబ్రవరి 17న రామగిరి మండలం కల్వచర్ల వద్ద జరిగిన న్యాయవాదుల హత్య కేసు విషయంలో వామనరావు తండ్రి కిషన్రావు ఏప్రిల్ 16న ఉత్తర తెలంగాణ ఐజీ నాగిరెడ్డికి, రామగుండం సీపీ సత్యనారాయణకు రిజిస్టర్డ్ పోస్టు ద్వారా లిఖితపూర్వక ఫిర్యాదు పంపించారు. హత్యకు ఉపయోగించిన కారు కొనుగోలుతోపాటు ప్రధాన నిందితుడు కుంట శ్రీను పోలీసుల అదుపులో ఉన్నప్పటికీ అతని ఇల్లు శరవేగంగా నిర్మాణం జరుగుతున్నదని చెప్పారు. హత్య కోసం నిందితుడికి రూ.2 కోట్ల సుపారీ ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నట్టు పోలీసులు చెప్తున్నారు. ఈ విషయంలో పుట్ట మధును గతంలోనే ఒకసారి రామగుండం కమిషనరేట్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు.
రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం పర్యవేక్షణలో ఈ విచారణ జరుగుతున్నందున కిషన్రావు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న పలు అంశాలను పరిగణనలోకి తీసుకొని పుట్ట మధును మళ్లీ అదుపులోకి తీసుకున్నట్టు రామగుండం సీపీ సత్యనారాయణ తెలిపారు. అదుపులోకి తీసుకొని విచారణ మాత్రమే చేస్తున్నామని, ఇంకా అరెస్టు చేయలేదని చెప్పారు. అత్యున్నత న్యాయస్థానం పర్యవేక్షణలో హత్యకేసు విచారణ జరుగుతున్నదని, పూర్తి వివరాలు ఇప్పుడే వెల్లడించలేమని స్పష్టంచేశారు. దీనికితోడు పుట్ట మధు వారం రోజులుగా గన్మెన్లను వదిలి ఎక్కడెక్కడికి వెళ్లారు? అన్న కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా, వామన్రావు హత్య కేసులో గతనెల 26న రామగుండం సీపీ సత్యనారాయణ కరీంనగర్ కేంద్రంగా ఉన్న సెషన్ కోర్టులో ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటుచేయాలని కోరుతూ రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శికి ఉత్తరం రాశారు. కేసు విచారణను వేగవంతం చేశారు.