హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): పోలవరం బ్యాక్వాటర్ ప్రభావంపై జాయింట్ సర్వే నిర్వహించాలని కేంద్ర జల్శక్తిశాఖ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ శుక్రవారం లేఖ రాసింది. ఈ నెల 13న గోదావరి బేసిన్లోని అన్ని రాష్ర్టాలతో సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో ఈ లేఖకు ప్రాధాన్యం సంతరించుకొన్నది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పొందిన అనుమతులకు, ప్రస్తుతం కొనసాగుతున్న పనులకు ఎంతో వ్యత్యాసం ఉన్నదని, దీనివల్ల గతంలో కంటే ఊహించని రీతిలో ముంపు ఏర్పడుతుందని తెలంగాణతోపాటు, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ర్టాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయమై పోలవరం ప్రాజెక్టు అథారిటీ, ఏపీ ప్రభుత్వం పెడచెవిన పెడుతుండటంతో మూడు రాష్ర్టాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.
పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు ప్రాజెక్టు నిర్మాణంపై అన్ని రాష్ర్టాలతో ఏకాభిప్రాయం సాధించాలని కేంద్ర జల్శక్తిశాఖను ఆదేశించింది. ఈ నేపథ్యంలో పలుదఫాలు జరిగిన సమావేశాల్లో జాయింట్ సర్వే కోసం తెలంగాణ అనేకసార్లు డిమాండ్ చేయడంతో కేంద్ర జల్శక్తిశాఖ ఏపీకి ఆదేశాలు జారీ చేసింది.