Khammam | సత్తుపల్లి, మార్చి 31: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మంండలం బుగ్గపాడు పంచాయతీ పరిధిలోని చంద్రాయపాలెంలో ఏండ్ల తరబడి పోడు భూముల పంచాయితీ కొనసాగుతున్నది. ఇదే విషయమై ఆదివారం గిరిజనుల మధ్య ఘర్షణ తలెత్తింది. సమాచారం అందుకున్న పోలీసులు అడ్డుకునేందుకు వెళ్లగా.. గిరిజనులు వారిపై దాడికి దిగారు. వివరాల్లోకి వెళ్తే.. బుగ్గపాడు రెవెన్యూ పరిధిలోని చంద్రాయపాలెంలో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు హయాంలో 400 ఎకరాల్లో పోడు పట్టాలిచ్చారు. అప్పటి నుంచి చంద్రాయపాలెం గిరిజనులు ఆ భూమిని సాగుచేసుకుంటున్నారు. అయితే.. అందులో 30 ఎకరాల భూమికి సంబంధించి వివాదం నెలకొంది. శనివారం బుగ్గపాడు, ఇతర ప్రాంతాల గిరిజనులు వెళ్లి భూమిని చదును చేస్తుండటంతో చంద్రాయపాలెం గిరిజనులు అడ్డుకున్నారు.
30 ఎకరాల్లో ఉన్న ఆ భూమి తమదంటే తమదని గొడవకు దిగారు. ఈ విషయమై గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ కిరణ్ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరువర్గాలను విడదీసే ప్రయత్నం చేస్తుండగా.. బుగ్గపాడుకు చెందిన గిరిజనులు ఒక్కసారిగా పోలీసులపై దాడిచేసి తీవ్రంగా కొట్టారు. ఈ దాడిలో సీఐ కిరణ్తో సహా మరో ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి. అప్పటికే 300 మందికి పైగా గిరిజనులు చుట్టుముట్టి పోలీసులపై దౌర్జన్యానికి దిగడంతో వెనక్కి వచ్చారు. తర్వాత ఏసీపీ అనిశెట్టి రఘు ఆధ్వర్యంలో సబ్డివిజన్లోని పోలీసులతో కలిసి చంద్రాయపాలెం వెళ్లి దౌర్జన్యానికి దిగిన 30 మందికి పైగా గిరిజనులను గుర్తించి స్టేషన్కు తరలించారు. ఏసీపీ అనిశెట్టి రఘు, ఎఫ్డీవో మంజుల, ఎఫ్ఆర్వో స్నేహలత ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.