Pocharam Srinivas Reddy | తనను నమ్ముకొని పేదలు అప్పులు చేసి ఇండ్లు కట్టుకున్నారని.. వారి బాధ చూడలేనని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికలలోపు బిల్లులు రాకపోతే మే 13 తర్వాత బిల్లుల కోసం లబ్ధిదారులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తానని.. అయినా ప్రభుత్వం స్పందించకపోతే ప్రాణాత్యాగం చేస్తానన్నారు. తనకు ఇంతకు మించి మరో ప్రత్యామ్నాయం లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడ నియోజకవర్గంలోని పోతంగల్, కోటగిరి, రుద్రూరు మండల కేంద్రాల్లో జరిగిన కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు. జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి అనిల్కుమార్తో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్రంలో 11వేల డబుల్ బెడ్ రూం ఇండ్లు కేవలం మన బాన్సువాడ నియోజకవర్గానికి మాత్రమే మంజూరు అయ్యాయన్నారు. అందులో 10వేల ఇండ్ల నిర్మాణం పూర్తయ్యిందన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో రూ.400కోట్ల బిల్లులు ఇప్పించానన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత పెండింగ్లో ఉన్న రూ.26కోట్ల బిల్లులు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ మంత్రిని కోరితే.. ఈ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఆ మంత్రి దగ్గరకు వెళ్లి బిల్లులు ఇవ్వొద్దని చెప్పారటన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రూ.400కోట్ల బిల్లులు ఇప్పించానన్నారు. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.30 కోట్ల బిల్లులను ఇవ్వడం లేదన్నారు. తనను నమ్ముకుని పేదలు అప్పులు చేసి ఇండ్లు కట్టుకున్నారని తెలిపారు.