హైదరాబాద్: మహనీయుడి జన్మదినం రోజున కూడా రాజకీయాలు తగదని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas reddy) సూచించారు. ఇతర రాష్ట్రాలకు తెలంగాణ (Telangana) ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు ఇతర రాష్ట్రాల్లో ఉన్నాయా అని ప్రశ్నించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా అసెంబ్లీ (Assembly) ప్రాంగణంలోని బాబాసాహెబ్ విగ్రహానికి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender reddy), ఎమ్మెల్సీలతో కలిసి స్పీకర్ పోచారం నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రం, దేశంలోని ప్రజలందరికీ అంబేద్కర్ 132వ జయంతి ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు. ఈసారి అంబేద్కర్ జయంతికి ప్రత్యేకత ఉన్నదని చెప్పారు.
మహాత్మా గాంధీ వల్ల దేశానికి స్వాతంత్య్రం సిద్ధిస్తే.. పరిపాలన పద్ధతులు, దేశ పౌరులు శాంతి పూర్వకంగా బతకడానికి అవసరమైన రాజ్యాంగ రచనలో కీలకపాత్ర పోషించిన వ్యక్తి అంబేద్కర్ అని పేర్కొన్నారు. చిన్న రాష్ట్రాలతో మంచి పరిపాలన జరుగుతుందని ఆర్టికల్ 3లో అంబేద్కర్ సూచించారని, ఆయనకు రుణపడి ఉన్నామని చెప్పారు. అందుకే ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించుకున్నామని, అది తెలంగాణ ప్రజలకు గర్వకారణమన్నారు. దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఆశయంతో సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని అమలుచేస్తున్నారని వెల్లడించారు.
ఇప్పటికే 36,780 మందికి రూ.10 లక్షల చొప్పున అందించామని, ఈ ఏడాది బడ్జెట్లో రూ.17,700 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. అంచలంచలుగా పథకాన్ని అమచేస్తామన్నారు. దళితుల కోసం ఇంతపెద్ద ఎత్తున నిధులను ఏ రాష్ట్రం ఇవ్వలేదని స్పీకర్ పోచారం చెప్పారు.
అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మతాలకు అతీతంగా అందరూ పవిత్రంగా భావిస్తారని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. రాజ్యాంగంలో ఆయన చేర్చిన నిబంధన వల్లే తెలంగాణ సాధించుకోగలిగామని చెప్పారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం నిర్మించుకున్నామని వెల్లడించారు. సంక్షేమ పథకాల్లో తెలంగాణ.. దేశానికే దిక్సూచిగా మారిందని మండలి చైర్మన్ అన్నారు.