రుద్రూర్, మార్చి 10: అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకుసాగుతున్నదని తెలిపారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం సులేమాన్ నగర్ గ్రామంలో శుక్రవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.
జిల్లా పరిషత్ పాఠశాలలో మౌలిక వసతుల కల్పన కోసం రూ.37 లక్షలతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేశారు. అంగన్వాడీ, ఐకేపీ భవనాన్ని ప్రారంభించారు. రూ.20 లక్షల నిధులతో చేపట్టనున్న పంచాయతీ భవన నిర్మాణ పనులకు, రూ.10 లక్షలతో చేపట్టనున్న ఆరోగ్య ఉపకేంద్ర భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. ఏ రాష్ట్రంలో లేనివిధంగా మన రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతున్నదని తెలిపారు.