హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): ఎడారిగా మారుతున్న తెలంగాణను సస్యశ్యామలం చేసిన గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరమని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి కొనియాడారు. దాన్ని జీర్ణించుకోలేని కొందరు రాజకీయాల కోసం అసత్యాలను, అభూత కల్పనలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టుల నిర్మాణంలో సాంకేతిక లోపాలు సహజమన్నారు. అందుకు కడెం ప్రాజెక్టే ఉదాహరణ అని గుర్తుచేశారు. కాంగ్రెస్ సర్కారు మేడిగడ్డ లోపాలను సరిదిద్దకుండా ప్రాజెక్టే వృథా అని ప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు. కాళేశ్వరం నీళ్లు లేకుండానే టన్నుల కొద్దీ పంటలు పండాయా? అని ప్రశ్నించారు. రాజకీయాల కోసం రైతుల జీవితాలను పణంగా పెట్టవద్దని హితవు పలికారు. ప్రాజెక్టుకు రూపకల్పన చేసిన తమ సలహాలు తీసుకోవాలని కోరారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ విష ప్రచారాన్ని తిప్పికొట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించుకున్నది. అందులో భాగంగా ‘కాళేశ్వరంపై కాంగ్రెస్ విష ప్రచారం.. బీఆర్ఎస్ వాస్తవాలు’ పేరిట బుక్లెట్ విడుదల చేసింది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైనింగ్ ఆవశ్యకత, కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర స్వరూపాన్ని అందులో వివరించింది. అంచనా వ్యయం పెరగడానికి కారణం, కాళేశ్వరం ద్వారా సాధించిన విజయాలను గణాంకాలతో వెల్లడించింది. ప్రాజెక్టులో భాగమైన రిజర్వాయర్లు, పంప్హౌజ్లు, కాలువల వివరాలను ఫొటోలతో ప్రచురించింది.