బాన్సువాడ: బాన్సువాడ బీఆర్ఎస్ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas Reddy) నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ ఎన్నికల గుర్తు అయిన అంబాసిడర్ కారులో (Ambassador Car) బాన్సువాడలోని (Banswada) రిటర్నింగ్ ఆఫీస్కు చేరుకున్న ఆయన తన తొలి సెట్ నామినేషన్ను (Nomination) సమర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. తాను నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్నాని చెప్పారు. అందుకే 1994 నుంచి ఒక్కసారి మినహా ఎన్నికల్లో వరుసగా విజయాలు సాధించానన్నారు. ప్రజల అభిమానం వల్లే ఇది సాధ్యమయిందని చెప్పారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన 7 గంటల కరెంట్ హామీని కూడా నెరవేర్చడం లేదని విమర్శించారు. మహిళలకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణమని చెప్పారని.. తీరా గెలిచిన తర్వాత బస్సులను బంద్ చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రకటించిన మ్యానిపెస్టో అద్భుతంగా ఉందని చెప్పారు. బీఆర్ఎస్ ఆమోద యోగ్యమైన, అమలు చేయదగిన మ్యానిఫెస్టో అన్నారు. బీఆర్ఎస్కు చాలా స్థానాల్లో పోటీయే లేదని సర్వేలు చెబుతున్నాయని తెలిపారు. తాము మూడోసారి అధికారంలోకి రావడం.. సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవడం ఖాయమన్నారు.
తెలంగాణ శాసనసభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా తొలి రోజు 119 నియోజకవర్గాల్లో 100 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుంది. నవంబర్ 13న నామినేషన్ల పరిశీలన, 15న ఉపసంహరణ ఉంటాయని నోటిఫికేషన్లో ఎన్నికల సంఘం తెలిపింది.