Pocharam Srinivas Reddy | సంగారెడ్డి, మార్చి 30(నమస్తే తెలంగాణ): ప్రజలను మోసం చేస్తున్న కాం గ్రెస్, బీజేపీలకు పార్లమెంట్ ఎన్నికల్లో దిమ్మతిరిగేలా ప్రజలు తీర్పు చెప్పాలని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో బీఆర్ఎస్ జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశం నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్కుమార్, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా మోసం చేస్తున్నదని విమర్శించారు. ఆరు గ్యారెంటీలు, 12 హామీలు నెరవేరుస్తామని చెప్పి కాంగ్రెస్ మాట తప్పిందని మండిపడ్డారు. హామీలను నిలబెట్టుకోవడంలో రేవంత్ సర్కార్ ఘోరంగా విఫలమైందని అన్నారు. 2 లక్షల రుణమాఫీ, రైతుబంధు, రైతుబీమా, వరికి రూ.500 బోనస్ హామీలు కాంగ్రెస్ నెరవేర్చలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మోసాలు ఇప్పుడిప్పుడే ప్రజలకు, రైతులకు అర్థం అవుతున్నట్టు చెప్పారు. కేంద్రంలోని బీజేపీ పదేండ్లలో ప్రజలకు చేసింది ఏమీలేదని పోచారం విమర్శించారు. జహీరాబాద్లో గాలి అనిల్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.