Pocharam Srinivas Reddy | కామారెడ్డి : బాన్సువాడ మండలంలోని దేశాయిపేట్ రైతు వేదిక ఆవరణలో నిర్వహించిన రైతు దినోత్సవంలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రసంగించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు వానాకాలంలో 70 వేల ఎకరాల్లో పంట పండితే.. ఇప్పుడు ఒక లక్ష 10 వేల ఎకరాల్లో పంటలు పండిస్తున్నారని తెలిపారు. రైతులు తల ఎత్తుకొని బతకాలి.. తల దించుకుని బతకొద్దనేది కేసీఆర్ లక్ష్యమని పేర్కొన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో నీటి, కరెంట్ కొరత లేదని స్పష్టం చేశారు. 26వ తేదీన పోడు భూములకు పట్టాలు పంపిణీ చేస్తామని తెలిపారు. బాన్సువాడ నియోజక వర్గంలో 11 వేల డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇచ్చామన్నారు. గృహలక్ష్మి పథకాన్ని జులై నెలలో ప్రారంభిస్తామని పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.