Madhya Pradesh : మధ్యప్రదేశ్లోని ఉజ్జైన్లో ఉన్న దేవాలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. దైవ దర్శనానికి భక్తులు పోటెత్తడంతో ఈ ఘటన జరిగింది. పోలీసులు స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మధ్యప్రదేశ్, ఉజ్జైన్లో ప్రసిద్ధ మహకాళేశ్వర ఆలయ ప్రాంగణంలోనే శ్రీ హరసిద్ధి మాతా శక్తిపీఠ్ టెంపుల్, శ్రీ బడా గణేష్ మందిర్ పరిధిలో సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఇక్కడే నాగచంద్రేశ్వర ఆలయం కూడా ఉంది.
శ్రావణ సోమవారం కావడంతో నాగచంద్రేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. అయితే, అక్కడ ఏదో విద్యుత్ షాక్ తగిలింది అనే ప్రచారం జరగడంతో ఒకరినొకరు తోసుకున్నారు. దీంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో కొందరు భక్తులు కిందపడిపోగా, మరికొందరు వారిని తొక్కుకుంటూ వెళ్లారు. అలా, పలువురు భక్తులకు గాయాలైనట్లు తెలుస్తోంది. కింద పడిన వారిని ఇతరులు తొక్కుకుంటూ వెళ్లారే తప్ప సాయం కూడా చేయలేదని కొందరు సాక్షులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, ఇతర అధికారులు అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. భక్తుల్ని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు, సిబ్బంది చాలా శ్రమించాల్సి వచ్చింది.
గాయాలపాలైన వారిని అధికారులు స్థానిక ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఎలాంటి ఉద్రిక్త పరిస్తితి లేదని పోలీసులు తెలిపారు. అయితే, ఉదయం జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆరా తీస్తున్నారు. బాధితుల్లో పలువురు స్త్రీలు కూడా ఉన్నారు. ఒక వ్యక్తి కాలికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. అంతకుముందు బిహార్లోని ఒక ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఏడుగురు మరణించిన సంగతి తెలిసిందే.