ఐదుగురిని అదుపులోకి తీసుకొన్న అధికారులు
సత్తుపల్లి రూరల్, ఫిబ్రవరి 13: వేటగాళ్లు అమర్చిన ఉచ్చుకు ఓ దుప్పి బలైంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి శివారు సింగరేణి ఓసీలో ఈ ఘటన చోటుచేసుకొన్నది. ఫారెస్ట్ రేంజర్ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. మండలంలోని రేజర్ల గ్రామానికి చెందిన పొదిలి జగదీశ్, బండి గోపిరాజు, అల్లిక సాయికృష్ణ, అల్లిక రామకృష్ణ, చిలకబత్తుల సురేశ్ ఓసీ-2 ఏరియాలో శనివారం రాత్రి వన్యప్రాణుల కోసం ఉచ్చులను అమర్చగా ఓ దుప్పి ఉచ్చుకు చిక్కింది. వేటగాళ్లు దాన్ని హతమార్చి మాంసాన్ని విక్రయించారు. సమాచారం అందుకొన్న అధికారులు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించారు. వారి వద్ద నుంచి దుప్పి చర్మం, కాళ్లు, 30 ఉచ్చులను స్వాధీనం చేసుకొన్నారు.