మెదక్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో కాంగ్రెస్ డబుల్ ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నదని, దాంతో ఢిల్లీకీ కప్పం కడుతున్నారని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. డబుల్ ఆర్ ట్యాక్స్పై ఆలోచించకుంటే ఐదేండ్లలో ఆగమవుతారని హెచ్చరించారు. ‘మీరు జీవితాంతం సంపాదించుకున్న ఆస్తులపై కాంగ్రెస్ కన్నేసింది.
మీ సంపాదన మీ పిల్లలకు కాకుండా చేసేందుకు, మీ సంపదలో 55% లాక్కున్నేందుకు కుట్ర చేస్తున్నది ’ అని ఆరోపించారు. ప్రధాని మోదీ మంగళవారం మెదక్ జిల్లా అల్లాదుర్గంలోని చిల్వేర్ వద్ద నిర్వహించిన మెదక్, జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గాల ఎన్నికల జనసభకు హాజరై ప్రసంగించారు. కాంగ్రెస్ ఎక్కడ అధికారంలోకి వచ్చినా అబద్ధాలు, అవినీతి, మాఫియా, ఓటుబ్యాంక్ రాజకీయాలు, కుటుంబపాలన అనే పం చసూత్రాలతో పాలన సాగిస్తున్నదని దుయ్యబట్టారు.
వంద రోజుల్లో రూ.2 లక్షల పంట రుణమాఫీ చేస్తామని చేయలేదని, ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి మోసం చేసిందని ఆరోపించారు. ఓటుబ్యాంక్ రాజకీయాల కోసం హైదరాబాద్లో శ్రీరామనవమి ఉత్సవాలపై ఆంక్షలు విధించిందని ధ్వజమెత్తారు. ఉమ్మడి ఏపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం చేసి ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చిందని ఆరోపించారు.
ఈ ప్రాంతంలో ఉన్న లింగాయత్, మరాఠీలు బీసీలో చేర్చాలని డిమాండ్ చేస్తుంటే, కాంగ్రెస్ పార్టీ వారిని ఓబీసీలో కూడా చేర్చలేదని, ముస్లింలను మాత్రం రాత్రికిరాత్రే బీసీల్లో చేర్చిందని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని, అంబేద్కర్ను అవమానించిందే యువరాజు (రాహుల్గాంధీ) ముత్తాత, నాన్నమ్మేనని విమర్శించారు. మన్మోహన్సింగ్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే, మీడియా ముందు ఆ ప్రతులను యువరాజు చించేశారని గుర్తుచేశారు.
రాజ్యాంగం మాకు ధర్మగ్రంథం
తమ ప్రభుత్వానికి రాజ్యాంగం ధర్మగ్రంథమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రాజ్యాంగంపై తమకు ఉన్న గౌరవాన్ని శంఖించాల్సిన అవసరం లేదని, తాను బతికున్నంత కాలం రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని చెప్పుకొచ్చారు. భారత రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీయే గౌరవించదని ఎదురుదాడికి దిగారు.
మూడోసారి పాలనలో రాజ్యాంగం 75 ఏండ్లు పూర్తి చేసుకుంటుందని, దేశంలోని ప్రతి గల్లీలో వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగానికి ఎలా తూట్లు పొడిచిందో ప్రజలకు వివరిస్తామని చెప్పారు. రాజ్యాంగ పదవిలో ఉన్న ముఖ్యమంత్రి ఫేక్ వీడియోలు తయారు చేయాల్సిన పనేనా? అం టూ రేవంత్రెడ్డిపై విమర్శలు చేశారు.
అవినీతి కేసుల్లో ఒకరికొకరు కాపాడుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. సభలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి, మెదక్, జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థులు రఘునందన్రావు, బీబీ పాటిల్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.