హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): బీసీలకు పదేండ్లుగా తీవ్ర అన్యాయం చేస్తున్న ప్రధాని మోదీ ఇప్పుడు ‘బీసీ సీఎం’ హామీ ఇవ్వడం హాస్యాస్పదమని తెలంగాణవాదులు మండిపడుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బీసీ బండి సంజయ్ని పదవి నుంచి తొలగించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అలాంటి పార్టీ ఒకవేళ తెలంగాణలో గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామంటే ఎలా నమ్ముతామని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ బీసీలకు 36 టికెట్లు మాత్రమే ఇచ్చిందని గుర్తు చేస్తున్నారు. జనాభాకు తగ్గట్టుగా కనీసం సగం టికెట్లు కూడా ఇవ్వని పార్టీ.. సీఎంను ఎలా చేస్తుందని అడుగుతున్నారు. దీంతోపాటు బీసీ కులగణనపై ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.
దేశ జనాభాలో 70 కోట్ల బీసీ జనాభా ఉన్నదని, కేంద్రంలో ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ను ఎందుకు పట్టించుకోవడం లేదని బీసీ సంఘాల నేతలు నిలదీస్తున్నారు. తమకు కావాల్సింది ప్రజా ప్రతినిధుల సంఖ్య కాదని, ప్రజల జీవన స్థితిగతులను మార్చగలిగే మంత్రిత్వశాఖ అడుగుతున్నామని చెప్తున్నా రు. మంత్రులుగా బీసీలు ఉంటే ఆయా శాఖలకే పరిమితం అవుతారని, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉంటే దేశంలోని 70 కోట్ల జనాభా అభివృద్ధి గురించి ఆలోచించి, పథకాలు అమలు చేస్తారని పేర్కొంటున్నారు. 2014లో తెలంగాణ తొలి శాసనసభ సమావేశాల్లోనే ‘బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలి’ అని ఏకగ్రీవ తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మోదీ బీసీ మంత్రిత్వ శాఖపై ప్రకటన చేసే అవకాశం ఉన్నదంటూ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చెప్పారని, అయినా ఎందుకు ప్రకటించలేదని బీసీ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. మెడికల్ కాలేజీలు, డెంటల్ కాలేజీల్లో బీసీలకు సీట్లు ఇస్తున్నామని మోదీ చేస్తున్న ప్రకటనపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు. కేంద్రం తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదని గుర్తు చేస్తున్నారు. ప్రధాని మోదీ తెలంగాణను ఏవిధంగా అభివృద్ధి చేస్తారో చెప్పకుండా కుటుంబ పాలన అంటూ రొడ్డకొట్టుడు ఉపన్యాసాలకే పరిమితం అయ్యారని విమర్శిస్తున్నారు.
బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీసీ కులగణన చేయాలని డిమాండ్ చేసిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత చేతులు ఎత్తేసిందని పలువురు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. 2018లో కుల గణన చేస్తామని హామీ ఇచ్చి, మూడేండ్లలోనే మాట మార్చిందంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. 2021 అక్టోబర్లో తెలంగాణతోపాటు అనేక రాష్ర్టాలు ‘బీసీ కులగణన నిర్వహించాలి’ అని తీర్మానం చేసి కేంద్రానికి పంపినా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు.